సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుల్లో తమిళ 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఒకరు. కేవలం కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లోనూ తనదైన నటనతో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారాయన. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి తన బాల్యం, కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించాడు.
నాన్న పక్కనే కూర్చునేవాడిని
చిన్నప్పడు మేము చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా నాన్న మా కోసం చాలా అప్పులు చేశాడు. అవి కట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. ఒక్కోసారి అప్పులు కట్టలేదని మా ఇంటిపైకి దాడికి వచ్చేవాళ్లు. ఆ సమయంలో మా నాన్న ఒంటరిగా బాధపడకూడదని నేను ఎప్పుడూ ఆయన పక్కనే కూర్చునేవాడిని. మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు బుల్లెట్ బండిపై ఇంటికి వస్తూ.. ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేవాడు. మాతో షేర్ చేసుకొని తినేవాడు. అది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం.
డబ్బుల కోసం సినిమాల్లోకి వచ్చా
నటుడు అవ్వాలనేది నా లక్ష్యమే కాదు. కేవలం కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాల కోసమే నేను సినిమాల్లోకి వచ్చా. మొదట్లో సినిమాల్లో నటించడం నచ్చేది కాదు. కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టం. ఏ పని అయినా సరే గౌరవంగా చేయడం నా అలవాటు. సినిమాల్లోకి రాకముందు దుబాయ్లో అకౌంటెంట్గా పని చేశా. స్కూల్ ఏజ్లో కూలీ పనికి వెళ్లాను. రిటైల్ స్టోర్లో సేల్స్మ్యాన్గా, ఫాస్ట్ ఫుడ్ జాయింట్లో క్యాషియర్గా, ఫోన్ బూత్ ఆపరేటర్గా ఇలా చాలా పనులు ఇష్టంలో చేశాను.
అలా సినిమాల్లోకి..
‘దుబాయ్ నుంచి ఇండియా తిరిగి వచ్చాక నాటక రంగం వారితో పరిచయం ఏర్పడింది. ఆ అనుభవంతోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా మారాను’అని విజయ్ చెప్పుకొచ్చాడు. 'తెన్మేర్కు పరువకాట్రు' చిత్రంతో హీరోగా మారిన ఆయన.. ఆ తర్వాత 'సూదు కావ్వుమ్', 'విక్రమ్ వేద' 'మహారాజా' వంటి వైవిధ్యమైన చిత్రాలతో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ట్రైన్’, ‘స్లమ్ డాగ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


