యోగాతో ప్రపంచ శాంతి  | PM Narendra Modi participates In International Day of Yoga celebrations | Sakshi
Sakshi News home page

యోగాతో ప్రపంచ శాంతి 

Jun 22 2026 4:25 AM | Updated on Jun 22 2026 6:32 AM

PM Narendra Modi participates In International Day of Yoga celebrations

సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా అవసరం  

యోగాను కేవలం నిర్దిష్ట రోజుకు లేదా ఒక కార్యక్రమానికి పరిమితం చేయొద్దు 

అన్ని వయసులవారూ యోగాసనాలు అభ్యసించాలి 

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు  

కోల్‌కతా: వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రపంచ శాంతికి బాటలు వేయడంలో యోగా ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పని చేయగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సమాజంలో సామూహిక శాంతి, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే లక్షణం యోగాలో ఉందని వివరించారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని రెడ్‌ రోడ్‌లో ఆదివారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా అవసరమని అన్నారు. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చని సూచించారు. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలే దుఃఖాన్ని నిర్మూలించడానికి కీలకమని, ఇందుకు యోగా తోడ్పడుతుందని వెల్లడించారు. 

చాలామంది తమ ఆధునిక జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమతుల్యమైన రీతిలో జీవించే విధానాన్ని యోగా మనకు నేర్పుతుందని, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను కూడా బోధిస్తుందని పేర్కొన్నారు. మన శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవడం నేర్చుకున్నప్పుడు, ఆరోగ్యం ఒక అలవాటుగా మారుతుందని వెల్లడించారు.  

ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక 
యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుందని అన్నారు. యోగా అనేది వ్యక్తిగత జీవనశైలికే కాకుండా, ఈ ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరమని స్పష్టంచేశారు. సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుందని.. ఈ విలువలు సమాజంలో విభజనలు, సంఘర్షణను అంతం చేస్తాయని వ్యాఖ్యానించారు. 

యోగాను కేవలం ఒక నిర్దిష్ట రోజుకు లేదా ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం చేయకూడదని ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో, భావి తరాల జీవితాల్లోనూ ఒక భాగంగా చేసుకోవాలని తేల్చిచెప్పారు. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ, యోగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా మారిందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. భూమిపై అత్యంత సుదీర్ఘమైన రోజుగా నిలిచే జూన్‌ 21వ తేదీ ఇప్పుడు యోగా కారణంగా అతిపెద్ద సామూహిక వేడుకల దినంగా మారిందని పేర్కొన్నారు.  

వేలాది మందితో కలిసి యోగాసనాలు  
కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. తెల్ల రంగు టీ–షర్టు, ప్యాంట్‌ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అభ్యాసకుల యోగాసనాలను నిశితంగా గమనించారు. కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ వేడుకల్లో వృద్ధులు, చిన్నారులు సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.

టోక్యో నుంచి న్యూయార్క్‌ దాకా.. 
వాషింగ్టన్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, సమతుల్యత, శ్రేయస్సుకు యోగా ఒక చక్కని మార్గమని వీరంతా చాటారు. జపాన్‌ రాజధాని టోక్యోలోని చారిత్రక ఆలయాల దగ్గర్నుంచి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వరకు ఇందుకు వేదికలుగా మారాయి. 

ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ఇతివృతంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైనాలోని షాంఘై నగరంలో భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం చేపట్టిన కార్యక్రమానికి 400 మంది హాజరయ్యారు. ఆ్రస్టేలియాలోని కాన్‌బెర్రాలోగల ఓల్డ్‌ పార్లమెంట్‌ హౌస్‌ భారత హైకమిషన్‌ చేపట్టిన కార్యక్రమం యోగా ఆ్రస్టేలియా సీఈవో జోష్‌ ప్రియోర్‌ నేతృత్వం వహించారు. 

అమెరికాలోని న్యూయార్క్‌లోగల టైమ్స్‌ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున జరిగిన యోగా ఉత్సవాలకు భారత కాన్సులేట్‌ జనరల్‌ నాయకత్వం వహించారు. ఇంకా, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, న్యూజిలాండ్‌ లోని వెల్లింగ్టన్, ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకి, జర్మనీ రాజధాని బెర్లిన్, యూకే రాజధాని లండన్, మలేసియా రాజధాని కౌలాలంపూర్, తుర్కియేలోని అంకారా, సౌదీ అరేబియాలోని రియద్, స్పెయిన్‌లోని బార్సిలోనా, కెనడాలోని టొరంటోతోపాటు అనేక దేశాల్లోనూ కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్‌లోగల లింకన్‌ మెమోరియల్‌లో భారత ఎంబసీ నిర్వహించిన జరిగిన కార్యక్రమానికి వందలాదిగా హాజరయ్యారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement