కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పార్టీ నిధులపై పెత్తనం కోసం తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత పోరు మరింత ముదిరింది. టీఎంసీకి నిధులెక్కడి నుంచి వచ్చాయన్నది తేల్చాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల మేరకు బ్యాంకు అధికారులు మూడు ఖాతాల్లో ఉన్న రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను నిలిపి వేశారు.
ఈ క్రమంలో మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఈ నిధులను విత్ డ్రా చేయడం లేదా వేరే ఖాతాల్లోకి బదిలీ చేయడం ఇక కుదరదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల బిధాననగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మూడు అకౌంట్లలోకి నిధులు చట్ట ప్రకారం వచ్చాయా లేదా కట్–మనీ వసూళ్లు, ప్రభుత్వ నిధులను మళ్లించారా లేదా కుంభకోణాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చాయా అన్నది విచారణ చేపట్టి తేల్చాలని వారు కోరారు. కాగా, పార్టీ బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేయడానికి సంబంధించి పూర్తి వివరాలు అందలేదని మమత వర్గం తెలిపింది.
రెబల్స్ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, ఈ వ్యవహారం టీఎంసీలోని అంతర్గత విభేదాలను మరింతగా బయటపెట్టడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.


