వాషింగ్టన్: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందంగా మారకపోతే, ప్రపంచ ఇంధన సరఫరాలకు ప్రాణాధారంగా భావించే హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్లు (రుసుములు) విధించే అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు.
ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికలో చేసిన పోస్టులో.. ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ (Ceasefire) సమయంలో ఎలాంటి టోల్లు ఉండవని స్పష్టం చేశారు. అయితే చర్చలు విఫలమై తుది ఒప్పందం కుదరకపోతే, మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ‘Guardian Angel’గా అందించిన భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికానే టోల్లు విధించవచ్చని పేర్కొన్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తులో అందించిన భద్రతా సేవల ఖర్చులకు ఇది పరిహారం అని ఆయన వ్యాఖ్యానించారు.
There will be NO TOLLS in the Hormuz Strait for 60 days during the Cease Fire Period, and there will be NO TOLLS after the 60 day period has expired, unless they are imposed by and for the United States of America, should the deal not be completed, for services rendered as the… pic.twitter.com/f2DtGeiLUf
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 20, 2026
ఇరాన్ వాదన.. అమెరికా ఖండన
ఇదిలా ఉండగా, తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య లెబనాన్లో కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణకు విరుద్ధమని ఆరోపించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ వాదనను ఖండించింది. జలసంధి తెరిచే ఉందని, ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో ప్రయాణించాయని వెల్లడించింది.
స్విట్జర్లాండ్లో కీలక చర్చలు
ఈ వివాదాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులతో స్విట్జర్లాండ్లో కీలక చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, హార్మూజ్ భవిష్యత్ నిర్వహణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?
ట్రంప్ తాజా వ్యాఖ్యలు కేవలం రాజకీయ హెచ్చరికలు మాత్రమే కావు. హార్మూజ్పై టోల్లు లేదా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే ప్రపంచ చమురు ధరలు, రవాణా వ్యయాలు, ఇంధన మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం శాంతి చర్చల ఫలితాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపైనే ఉంది.


