ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, టిబెట్లోని యార్లంగ్ త్సాంగ్పో (Yarlung Tsangpo)నది దిగువ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్ట నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. దీంతో భారతదేశం డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇస్తోంది. చైనా టిబెట్ పరిధిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్కు కౌంటర్గా భారత్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై రూ. 1.5 లక్షల కోట్ల వ్యయంతో 11,000 మెగావాట్ల సామర్థ్యంతో మెగా జలవిద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వరంగ సంస్థ NHPC ఆధ్వర్యంలోప్రత్యేకంగా నిర్మించనున్న 'సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్' (SUMP) భారత దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్గా నిలువనుందని అంచనా. ఇది ఏటా 47 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా సృష్టించ బోయే కృత్రిమ వరదలు, నీటి కొరత ముప్పును ఎదుర్కొని, ఈశాన్య రాష్ట్రాల జల భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ ద్వంద్వ ప్రయోజనం, ఇటు ఆర్థిక విలువతో పాటు అటు భౌగోళిక-రాజకీయ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.
దీని రిజర్వాయర్ దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచేలా సుమారు 300 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఎగువన చైనా ఒకవేళ నీటిని అకస్మాత్తుగా వదిలినా లేదా ఆపివేసినా, ఈ రిజర్వాయర్ ఒక నియంత్రణ అవరోధంగా మారి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం పరివాహక ప్రాంతాలలో వరదలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
వివాదాస్పద నదిపై చైనాప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే, భారతదేశం ఇప్పుడు తన వ్యూహాత్మక ప్రతిస్పందనను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. లోక్సభకు ఇచ్చిన అధికారిక లిఖితపూర్వక సమాధానంలో, జలవిద్యుత్ వినియోగం కోసం చైనా ప్రణాళికలతో సహా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్రం ధృవీకరించింది. అలాగే, దిగువ ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని కాపాడటానికి అవసరమైన నివారణ, సవరణ చర్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్
అయితే ప్రపంచంలోనే పెద్దదైన చైనా 60వేల మెగావాట్ల మెడాగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పటికే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ఉండగా, SUMP నిర్మాణ పూర్వ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రీ-ఫీజిబిలిటీ (ప్రారంభ పరిశీలన) దశలో ఉంది. భారత్తో పోలిస్తే చైనా ప్రాజెక్ట్ సామర్థ్యం చాలా రెట్లు మించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలు


