కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర హోం మంత్రి అమిత్షా బంపరాఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలోరి మథురాపుర్లో బీజేపీ పరివర్తన్ యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును వ్యతిరేకించకపోతే.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి హిందూ శరణార్థి ఇప్పటికే పౌరసత్వాన్ని పొందేవాడు. అయినప్పటికీ హిందూ శరణార్థులెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క హిందూ శరణార్థి కూడా పౌరసత్వాన్ని కోల్పోకుండా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్రమ చొరబాటుదారులను లేకుండా చేస్తాం. చొరబాటుదారుల పేర్లను ప్రస్తుతం ఓటర్ల జాబితా నుంచి మాత్రమే తొలగిస్తున్నాం. దీనిపై మమతా దీదీ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిందంటే చొరబాటుదారులను పూర్తిగా ఇక్కడి నుంచి పంపించేస్తాం
ప్రజల కోసం దీదీ చేసిందేమీ లేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను మాత్రం ఆమె బుజ్జగిస్తున్నారు. మేమే రామ మందిరాన్ని, కాశి విశ్వనాథ్, మహాకాల్ కారిడార్ను కట్టించాం. మమతా బెనర్జీ ప్రజల్ని విస్మరించి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీఎం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇదే వారి పద్ధతి.
దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు అందుకుంటున్నారు. బెంగాల్ ఉద్యోగులు మాత్రమే ఇప్పటికీ ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే 45 రోజుల్లో ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం’ అని అమిత్ షా పునరుద్ఘాటించారు.


