72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్‌ | 72 Delhi Visits Not Even 72 Paise: KTR Sharp Attack on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్‌

Jun 25 2026 1:34 PM | Updated on Jun 25 2026 1:42 PM

72 Delhi Visits Not Even 72 Paise: KTR Sharp Attack on CM Revanth Reddy

సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చి.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ‘సర్‌’ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సాయాన్ని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్‌ మండిపడ్డారు. అలాంటి రేవంత్‌ను ఏమనాలో రైతులే చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయని అన్నారు. పెట్టుబడులు తగ్గడంతో పాటు నిర్మాణ రంగం కూడా మందగించిందని చెప్పారు.

రేవంత్‌ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్‌.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. "72 సార్లు ఢిల్లీకి వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేకపోయారు" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. "హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్‌ ఎగిరెగిరి పడుతున్నారు" అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్‌ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సర్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement