విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
అడ్డంకులను అధిగమించి ‘చలో విజయవాడ’
మండుటెండలోనూ కదం తొక్కిన అంగన్వాడీలు
గృహ నిర్బంధాలు.. కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు
అధికారుల ఆంక్షలను లెక్కచేయక పోరుబాట
వేతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్
న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం
పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాల్లోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు.. తప్పదనుకుంటే నలుగురైదుగురు వెళ్లండి’ అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకుని అంగన్వాడీలు పోరుబాట పట్టి.. న్యాయం కోసం నినాదాల పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు.. చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చి నిరసన గళమెత్తారు.
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని.. మండేఎండను సైతం లెక్కచేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకుని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ‘ధర్నా’గ్రహానికి దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వేస్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గం
ధర్నా చౌక్లో ఆందోళన సందర్భంగా జరిగిన సభలో మూడు యూనియన్ల ముఖ్య నాయకులు కె.సుబ్బరావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ, జె.లలిత, వీఆర్ జ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి.
కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి..
ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటనలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు అంగన్వాడీల ఆందోళనను విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు(హౌస్ అరెస్టుల)తో తీవ్రమైన ఆంక్షలు పెట్టింది.
విజయవాడలో అంగన్వాడీలు అడుగుపెట్టకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మందిని అదుపులోకి తీసుకుని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్బంధించి వాటిని తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు పరిసరాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ తదితర ప్రాంతాల్లో యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఛలో విజయవాడకు బయలుదేరుతున్న వారిని రైల్వే స్టేషన్లలోనే నిలిపివేశారు.
విశాఖలోని పలు ప్రాంతాల నుండి బయలుదేరుతున్న కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లలోనే అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీస్ నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు సైతం ఇచ్చారు. అనేక జిల్లాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి అడ్డుకోవడం గమనార్హం. ఎలాంటి ఆంక్షలు విధించినా.. భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది.
ధర్నా చౌక్లోనే వంటా వార్పు.. రోడ్డుపైనే నిద్ర
చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోడంతో సోమవారం రాత్రి కూడా అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంటా వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. అక్కడే నిద్రించి నిరసన తీవ్రతను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం దాదాపు 20 నెలలపాటు ఎదురు చూశామని, ఇకపై ఓర్పు వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. కనీసం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వేతనం పెంపుతోపాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని మూడు యూనియన్ల నేతలు హెచ్చరించారు.
కీలక డిమాండ్లు ఇవీ..
అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కలి్పంచాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.


