లెక్కలకు రెక్కలు! | Economic experts slams On Chandrababu Govt Over AP Budget 2026-27 | Sakshi
Sakshi News home page

లెక్కలకు రెక్కలు!

Feb 16 2026 3:17 AM | Updated on Feb 16 2026 3:17 AM

Economic experts slams On Chandrababu Govt Over AP Budget 2026-27

ఆదాయంపై ఊహాజనిత గణాంకాలతో బాబు సర్కారు భారీ బడ్జెట్లు

సవరించిన అంచనాల్లో భారీ కోతలు.. గత రెండు బడ్జెట్లలోనూ అదే తీరు

అంకెల గారడీతో ఏమార్చడమే లక్ష్యం

కేటాయించిన మేరకు వ్యయం చేయకుండా అన్ని వర్గాలకూ మోసం.

2024–25 బడ్జెట్‌లో రూ.22,141 కోట్లు కోత

2025–26 బడ్జెట్‌లో రూ.21,825 కోట్లు కోత

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి పచ్చముఠాల దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊహాజనిత లెక్కలతో వరుసగా మూడు బడ్జెట్లను  ప్రవేశపెట్టిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత రెండు బడ్జెట్లలోనూ అంచనాల మేరకు రాష్ట్ర పన్నుల ఆదాయం రాకపోవడంతో సవరించిన అంచనాల్లో భారీ కోతలు విధించడమే దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. తద్వారా బడ్జెట్‌ కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా కోతలు పెడుతోందని, ఇది అంకెల గారడీతో ప్రజలను మోసగించడమేనని తప్పుబడుతున్నారు.

చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక నుంచి మద్యం వరకూ.. చివరకు ప్రకృతి సంపదను సైతం వదలకుండా విచ్చలవిడిగా సిలికా, క్వార్ట్జ్, లేటరైట్, గనుల దోపిడీకి తెర తీసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం అంతా టీడీపీ పెద్దల జేబుల్లోకి చేరిపోతోంది. సంపద సృష్టించకుండా... సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా.. అంతులేని అప్పులతో రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతున్నారు.

హామీలు విస్మరించి.. పరిమాణం పెంచి
చట్టసభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను అపహాస్యం చేస్తూ, వాస్తవాలకు దూరంగా, ఊహాజనిత గణాంకాలతో 2026–27 వార్షిక బడ్జెట్‌ను చంద్రబాబు సర్కారు రూపొందించింది. బడ్జెట్‌ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయకుండా ఆయా వర్గాలను వంచిస్తోంది. ఆదాయం, రాబడులు రావని తెలిసి కూడా ప్రజలను ఏమార్చేందుకు  రూ.3,32,205 కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత రెండు బడ్జెట్‌లలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసినట్లుగానే వచ్చే ఆర్థికఏడాదిలో కూడా వంచించడమే లక్ష్యంగా ఊహాజనిత గణాంకాలతో బడ్జెట్‌ పరిమాణాన్ని భారీగా పెంచారని, ఈ బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించడం లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉత్త కేటాయింపులే.. అంతా కోతలే
2024–25, 2025–26 బడ్జెట్‌ కేటాయింపుల మేరకు నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. 2024–25లో రూ.2,94,427 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ రూ.19,820 కోట్ల మేర కోత విధించారు. చివరకు కోత విధించిన మేరకు కూడా బడ్జెట్‌ను అమలు చేయలేకపోయారు. వాస్తవ లెక్కల ప్రకారం 2024–25 బడ్జెట్‌ అంచనాల్లో రూ.22,141 కోట్ల మేర కోత పడింది. అంటే బడ్జెట్‌ రూ.2,72,286 కోట్లకే పరిమితమైంది. ఇక 2025–26లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో సవరించిన అంచనాలంటూ బడ్జెట్‌లో రూ.21,825 కోట్ల మేర కోత విధించింది. వాస్తవ లెక్కలు వెల్లడైతే ఎంత మేర కోత విధించారో స్పష్టం కానుంది. ఇదే రీతిలో ఈదఫా కూడా పేదలను మోసం చేయడానికి 2026–27 బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణాలకు రూ.6,357 కోట్ల కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాగితాలకే పరిమితమని, వాస్తవంగా వ్యయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గత రెండు బడ్జెట్‌లు నిరూపిస్తున్నాయి. 

పన్నుల ఆదాయం పతనం..
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం అంచనాల మేరకు లేదని తెలిసి కూడా వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్‌ను ఊహాజనిత లెక్కలతో, భారీ పరిమాణంతో ప్రవేశపెట్టారని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,789 కోట్లు వస్తుందని అంచనా వేయగా వాస్తవంగా వచ్చిన ఆదాయం రూ.89,435 కోట్లు మాత్రమే. రూ.20,354 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడింది.

2025–26లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.1,09,006 కోట్లు వస్తుందని బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సవరించిన అంచనాల్లో రూ.98,025 కోట్లుగా చూపించారు. అంటే రూ.10,981 కోట్ల మేర సొంత పన్ను ఆదాయంలో కోత పడుతుందని పేర్కొన్నారు. సొంత పన్ను ఆదాయం లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో సవరణల్లో తగ్గించారు. 2026–27 బడ్జెట్‌లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం ఏకంగా రూ.1,25,845 కోట్లు వస్తుందని చూపారు. 2025–26 సవరించిన అంచనాలను మించి ఏకంగా రూ.27,820 కోట్లు రాబడి వస్తుందని పేర్కొనడం గమనార్హం.

కాగితాల్లోనే పేదల ఇళ్లు..
పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు సర్కారు గత రెండు బడ్జెట్లలో ఎంత మోసం చేసిందో చెప్పేందుకు సవరించిన అంచనాలే నిదర్శనం. పేదల ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైనట్లు సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో తేలింది. 2024–25లో పేదల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.4,012 కోట్లు కేటాయించి చివరకు కేవలం రూ.1,611 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇక 2025–26 బడ్జెట్‌లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లను కేటాయించగా సవరించిన అంచనాల్లో వ్యయం కేవలం రూ.2,017 కోట్లుగా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ మేరకు కూడా వ్యయం చేయడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement