సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే ప్రజలకు నిరాశ, నిస్పృహ కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బడ్జెట్ మోసపూరిత బడ్జెట్.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
..నాడు-నేడు స్కీమ్ను సమాధి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే వైఎస్సార్, జగన్కు పేరొస్తుందని భయం. ఆరోగ్యశ్రీని రద్దు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే రోజుల్లో లక్ష కోట్లు అప్పులు చేస్తామని చెబుతున్నారు.
..బడ్జెట్లో మహిళా సాధికారత వెతికినా కనిపించదు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి హామీలిచ్చారు. ఆడబిడ్డ నిధి అన్నారు ఏమైంది?. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు ఏమైంది?. జాబ్ క్యాలండర్ ఇస్తామన్నారు ఏమైపోయింది?. ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్ రూపొందించారు. గత బడ్జెట్లో కేటాయింపులెంత?. ఎంత ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వివిధ రంగాలకు చేయూతనివ్వాల్సింది పోయి దుబారా ఖర్చులు చేస్తున్నారు. హెలీకాప్టర్లకు, లూద్రా వంటి లాయర్లకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.


