సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.
గతేడాది నవంబర్లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును
2023లో పెండింగ్లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.



