సాక్షి, అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా రాయచోటిలో ‘104’ వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు అదృశ్యమయ్యాయి. రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం కాగా.. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు కొంతమంది సిబ్బంది తరలించినట్లు సమాచారం.

104లను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో 104లను ధ్వంసం చేస్తున్న వీడియో.. సాక్షి చేతికి చిక్కింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, 104లను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేశారు.




