రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు రానేరాదు
2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు కదా?
అంతకుముందు ఏడాది రూ.1.67 లక్షల కోట్లే..
బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితం
ఏపీ బడ్జెట్పై మాజీ సీఎస్ ‘ఐవైఆర్’ విశ్లేషణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై మేధావులు పెదవివిరుస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వల్ల ఆకాంక్షలు తప్ప ఆచరణ సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. ఆ కోవలోనే సీనియర్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర బడ్జెట్పై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ.2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది గానీ, ఆ మేరకు కచ్చితంగా ఆదాయం రాదని ఆయన స్పష్టంచేశారు.
2025–26లో వచ్చింది రూ.1.96 లక్షల కోట్లు అయితే, అంతకుముందు ఏడాది కూడా రూ.1.67 లక్షల కోట్లే వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కేసుకున్నా రూ.2.15 లక్షల కోట్లకు మించదన్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే, దానిని కూడా ఆదాయంగా భావించి పథకాలు రూపొందించడం వల్ల వాటి అమలుపై ప్రభావం పడుతుందని ఆయన స్పష్టంచేశారు. ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పడం వల్ల బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఐవైఆర్ వివరించారు.
మసిపూసి మారేడు..
రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహాజనితంగా మాట్లాడుతోందని ఐవైఆర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నాటికే రూ.60 వేల కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందని తెలిపారు. అలాంటిది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది మొత్తానికి గాను రూ.41 వేల కోట్ల దగ్గర రెవెన్యూ లోటును నియంత్రిస్తామని ప్రభుత్వం ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ఈ లోటు ప్రభుత్వం చెబుతున్న దానికి రెట్టింపు అయ్యి రూ.80 వేల కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్కు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని, లేదంటే బడ్జెట్కు ఉన్న విశ్వసనీయత తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మూలధన వ్యయం 2024–25లో రూ.16 వేల కోట్లు ఉంటే, 2025–26లో బడ్జెట్లో రూ.40 వేల కోట్లుగా చూపించి, సవరించిన పద్దుల్లో రూ.33 వేల కోట్లు ఉంటుందని చెప్పారన్నారు. అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యే అవకాశం ఉందా... ఆచరణ సాధ్యం కాదా... అంటే సాధ్యం కాదనే అనిపిస్తోందని ఐవైఆర్ తన విశ్లేషణలో స్పష్టంచేశారు. అప్పులు తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది? పెండింగ్ బిల్లులకు ఎంత వెళుతుందనేది చెప్పాలి. ఈ బడ్జెట్ను చూస్తే మసిపూసి మారేడు చేసినట్లుగా ఉందని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.


