మార్చి చివరి వరకే విద్యుత్ రాయితీలు
ఆ తర్వాత మొత్తం చార్జీలు చెల్లించాల్సిందే
50 వేల మంది జీవనోపాధి ప్రశ్నార్ధకం
సాక్షి, అమరావతి: ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలు ఈ ఏడాది మార్చి చివరి వరకే కొనసాగుతాయని, ఆ తర్వాత ఉండవని తేల్చి చెప్పింది. రెండేళ్ల పాటు రాయితీలు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించలేదు.
మార్చి 31 వరకే రాయితీలు ఉంటాయని, ఈ ఏడాది ఏప్రిల్ 1 (వచ్చే ఆరి్థక సంవత్సరం) నుంచి రాయితీలు లేకుండా సాధారణ సుంకాలను చెల్లించడానికి సిద్ధం కావాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ పరిశ్రమలు ఆరి్థక ఇబ్బందుల్లో పడి, ఆ ప్రభావం 50 వేల మంది జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని పారిశ్రామిక, కారి్మక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇకపై నడపడం కష్టమే
రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరి సంక్షేమంతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ ప్రభుత్వం ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ సుంకం యూనిట్కు రూ.0.6 పైసలకు, డిమాండ్ ఛార్జీలు 90 శాతం వరకూ తగ్గించింది. 10 శాతం మాత్రమే వసూలు చేసింది. పరిశ్రమలు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పాలకులు కరగలేదు.
ఈ వెసులుబాటు ఆ పరిశ్రమలకు ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుందని తెగేసి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ముక్కుపిండి మరీ మొత్తం చార్జీలను వసూలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ఈ పరిశ్రమలపై నిబంధనలు విధించింది. వాటికి అవసరమయ్యే కరెంటును కేవలం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నుంచే కొనాలని గతేడాదే నిబంధనలు విధించింది.
మార్చి తరువాత వేసవిలో ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే విద్యుత్ కొరత కారణంగా అధిక ధరలకు డిస్కంలు విద్యుత్ను కొంటాయి. దానిని సరఫరా చేసి ఎక్కువ చార్జీలు వసూలు చేయడం వల్ల ఫెర్రో పరిశ్రమలకు మరింత భారంగా మారుతుంది. దానికి తోడు ఈ రాయితీలు కూడా మార్చితో ముగిసిపోతే అవీ, ఇవీ కలిపి ఫెర్రో అల్లాయ్స్ మూతపడే పరిస్థితి వస్తుందని పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


