మీడియాతో మాట్లాడుతున్న జక్కంపూడి రాజా, విజయలక్ష్మి, చెల్లుబోయిన
వైఎస్సార్ సీపీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మా, చెల్లుబోయిన వేణు, రాజా ధ్వజం
మృతులు, బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
రాజమహేంద్రవరం రూరల్: కల్తీ పాల పాపం చంద్రబాబు సర్కారుదేనని, ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కల్తీపాల వల్ల అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా పరామర్శించారు. అలాగే కల్తీపాల వల్ల మరణించిన కుటుంబాలను వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వారు విలేకరులతో మాట్లాడారు.
కల్తీ పాల వల్ల దాదాపు వారం రోజులుగా ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు సర్కారుకు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై, భద్రతపై లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగాన్ని వారి పనిని వారిని చేసుకోనిస్తే ఇలా ప్రజల ప్రాణాలు పోవని రాజా పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాధితులను ఏ ఒక్క అధికారి ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధితుల ఆస్పత్రుల బిల్లులకే రూ.లక్షలు ఖర్చవుతున్నాయని, రెండేళ్లలోపు చిన్నారి రితిక చికిత్సకు ఇప్పటివరకు రూ.8.50 లక్షలు ఖర్చయిందని రాజా ఆవేదన చెందారు. మృతదేహాల పోస్టుమార్టం, అంత్యక్రియలకు ప్రభుత్వం హడావుడి చేయడం అనుమానాలకు తావిస్తోందని రాజా మండిపడ్డారు.
బాధితులకు తమ పార్టీ నాయకుల ద్వారా సాయం అందజేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతగానితనం వల్లనే పాల కల్తీ ఘటన జరిగిందన్నారు. వారం పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులు చేరుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నెలల పిల్లలూ కల్తీ పాల బారిన పడ్డారని, వారికీ డయాలసిస్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లే దని మండిపడ్డారు. తక్షణం సర్కారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


