యూరియా కోసం బారులు తీరిన రైతులు
రబీలోనూ కటకటే.. అన్నదాతల అగచాట్లు
బయట ఎమ్మార్పికి మించి ఇష్టారాజ్యంగా దోపిడీ..
బస్తా రూ.350 నుంచి రూ.600 దాకా బాదుడు..
అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
అదే నెలలో 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు
పక్కదారి పట్టించి దొడ్డిదారిన మిక్సింగ్ ప్లాంట్లకు
సాగు చివరి దశకు చేరుకున్నా రైతన్నకు తప్పని ఇక్కట్లు
మరొకవైపు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువుల భారం
ఒకే సీజన్లో రెండుసార్లు ధరలు పెంచిన కంపెనీలు
తడిసి మోపెడవుతున్న పెట్టుబడి ఖర్చులతో అన్నదాత కన్నీళ్లు
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి. వచ్చిన యూరియా వచ్చినట్లుగా దొడ్డి దారిన మిక్సింగ్ ప్లాంట్లకు తరలిపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా రూ.350 నుంచి రూ.600 చొప్పున కొనాల్సిన అగత్యం ఏర్పడింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండుసార్లు పెరగడం రైతులకు పెనుభారంగా మారింది. ఇప్పటికే కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.30 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే విదిల్చింది. ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టింది. కౌలు రైతులకైతే రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. సున్నా వడ్డీకి చాప చుట్టేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో బీమా పరిహారానికి రైతులు దూరమయ్యారు. ఇక 20 నెలలుగా ధాన్యం సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరలు దక్కడం లేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని ఎత్తివేశారు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో అడ్డగోలుగా కోత పెట్టారు. కనీసం యూరియా కూడా అదునుకు అందించకుండా రైతులు అధికంగా వినియోగిస్తున్నారంటూ తమ వైఫల్యాన్ని వారిపై గెంటేస్తున్నారు.
పక్కదారి..
రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. ఒకవైపు యూరియా కోసం రైతులు అల్లాడుతుండగా.. మరోవైపు లక్షల టన్నుల విక్రయాలు పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ యూరియా అంతా రైతుల పొలాలకు బదులుగా ప్రైవేట్ వ్యాపారుల ఆధీనంలోని బ్లాక్ మార్కెట్కు చేరిపోయినట్లు స్పష్టమవుతోంది. సీజన్లో 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 6.27 లక్షల టన్నులు విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఒక్కకట్ట కోసం పడరాని పాట్లు పడుతుండటం గమనార్హం. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నంద్యాల జిల్లాలో బయట మార్కెట్లో బస్తా రూ.500 పెట్టి కొన్నామని జొన్న, మొక్క జొన్న రైతులు చెబుతుండగా.. నెల్లూరు జిల్లాలో రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించినట్లు వరి సాగుదారులు వాపోతున్నారు. సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా టీడీపీ నేతల సిఫారసు ఉంటేగానీ కరుణించడం లేదు.
విత్తగానే లక్షల టన్నుల విక్రయాలా?
రాష్ట్రంలో లక్షలాది టన్నుల యూరియా దారి మళ్లిపోయిందని సాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నెలలవారీగా సాగు, అమ్మకాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో యూరియా పక్కదారి పట్టిందో వెల్లడవుతుంది. రబీ సీజన్ ఏటా అక్టోబర్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంటలకు ఆరంభంలోనే యూరియా పెద్దగా అవసరం ఉండదు. పంటలు వేయడమే ఆలస్యం.. లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగిపోవడం దారి మళ్లించారనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
⇒ అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. కేవలం 22 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 6,500 ఎకరాల్లో జొన్న సాగైంది. ఒక్క ఎకరాలో కూడా మొక్కజొన్న సాగవలేదు. అయినా సరే అక్టోబర్లో ఏకంగా 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది.
⇒ నవంబర్లో 7.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 1.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 82 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 57 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. నవంబర్లో మరో 1.14 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి.
⇒ డిసెంబర్లో మరో 21.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 6.07 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 4.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 68 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. కానీ డిసెంబర్లో ఏకంగా 1.67 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి.
⇒ జనవరిలో 15.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా... 8.7 లక్షల ఎకరాల్లో వరి, 2.07 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 55 వేల ఎకరాల్లో జొన్న పంటలు సాగయ్యాయి. జనవరిలో ఏకంగా 2.24 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో మరో 1.77 లక్షల టన్నులు, మార్చిలో 1.28 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మిక్సింగ్ ప్లాంట్లకు మళ్లుతున్న యూరియా
యూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేట్ వ్యాపారులకే కేటాయిస్తున్నారు. పట్టుమని పది శాతం ఆర్ఎస్కేలకు కూడా సరఫరా చేయడం లేదు. దీనివల్ల యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. పెద్ద ఎత్తున యూరియా దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో స్వయంగా పేర్కొనడం గమనార్హం. సారా, బీర్ల తయారీతో పాటు రంగుల కంపెనీలు, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూతపడిన మిక్సింగ్ ప్లాంట్లు ఇటీవల పెద్దఎత్తున తెరుచుకుంటున్నాయి. విజిలెన్స్ దాడులు మొక్కుబడిగా మారాయి.
‘కాంప్లెక్స్’ ధరల మోత
ఒకవైపు యూరియా దొరకక అల్లాడుతుండగా మరోవైపు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల మోత మోగుతోంది. సీజన్ ప్రారంభంలోనే బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచేసిన కంపెనీలు తాజాగా మరోసారి రూ.50 నుంచి రూ.250 మేర పెంచేశాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే ప్రత్యేక ఎరువుల (వాటర్ సాల్యుబల్ ఫెర్టిలైజర్స్) ధరలను సీజన్ ఆరంభంలోనే 25–50 శాతం మేర పెంచాయి. ఎకరాకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అదనంగా భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీలు ఖర్చులు, యంత్రాల అద్దెలన్నీ కలిపితే వరికి రూ.6 వేలు, మొక్కజొన్నకు రూ.8 వేల వరకు ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరిగాయి.
అదనంగా రూ.13 వేల భారం
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన ఎర్రం కృష్ణారెడ్డి రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎన్నిసార్లు తిరిగినా సొసైటీలో, రైతు సేవా కేంద్రాల్లో ఒక్క కట్ట కూడా యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ డీలర్ల వద్ద కొన్నాడు. ఎమ్మార్పీ ప్రకారం బస్తా యూరియా ధర రూ.266 కాగా గత్యంతరం లేని పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి రూ.495 చొప్పున 58 బస్తాలు కొనుగోలు చేశాడు.
దీంతో రూ.13 వేలకు పైగా అదనంగా భారం పడిందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు. యూరియాతో పాటు బలవంతంగా అంటగట్టిన కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే కావాల్సినంత యూరియా ఇచ్చేవారని, ఐదేళ్లలో ఏ రోజూ ఎరువుల కోసం ఊరు దాటాల్సిన పరిస్థితి రాలేదని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఖరీఫ్లో మొదలైన అగచాట్లు రబీలోనూ వెంటాడుతున్నాయని, ఇలాగైతే వ్యవసాయం చేసేదెలా? అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.

ఎన్నిసార్లు వెళ్లినా ‘నో స్టాక్’
రబీలో 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి వ్యవసాయం భారంగా మారింది. సరిపడా యూరియా లభ్యం కావడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అధికార పార్టీకి చెందిన వారికే అమ్ముతున్నారు. ప్రస్తుతం వరి పంటకు మూడో కోటా యూరియా వేయాలి. ఎన్నిసార్లు వెళ్లినా నో స్టాక్ అంటున్నారు. చేసేది లేక బహిరంగ మార్కెట్లో బస్తా రూ.400 పెట్టి కొన్నా. కాంప్లెక్స్ ఎరువులు 20 నుంచి 30 శాతం ధరలు పెంచేశారు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. – ఏలూరు శ్రీధర్ రెడ్డి మనుబోలు నెల్లూరు జిల్లా,
రూ.3వేలకుపైగా అదనపు భారం
ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటి వరకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. మంచి దిగుబడి రావాలంటే యూరియా చాలా అవసరం. రైతు సేవా కేంద్రం సిబ్బంది స్టాక్ లేదు అంటున్నారు. బయట బస్తా రూ.350–400 పెట్టి దాదాపు 25 బస్తాల యూరియా కొన్నా. రూ.3 వేలకు పైగా అదనపు భారం పడింది. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బందిపడ్డాం. – జి.డి.వీరదాస్, బ్రహ్మసముద్రం, అనంతపురం జిల్లా
రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..
అదునుకు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా,. గోదావరి డెల్టాలో ధాన్యం, మొక్కజొన్న, మినుము తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం. ఎనీ్టఆర్, నెల్లూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలలో యూరియా కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది..
అదునుకు యూరియా దొరక్క రబీలో రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. రూ.267కు లభించాల్సిన బస్తా బ్లాకులో రూ.400 నుంచి రూ.600కు కొనుక్కోవల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, పెరిగిన కూలీ ఖర్చులు, యంత్రాల అద్దెల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. పంటలను మద్దతు ధరకు కొనే వారు లేక రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతు సంక్షేమం పేరిట ప్రకటనలకు పరిమితమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమవుతోంది.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్


