అమరావతి పర్యటనలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్
ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ దిశ: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై సీఎం ప్రజెంటేషన్
సాక్షి, అమరావతి: డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులున్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ చెప్పారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే ఎక్కువని తెలిపారు. గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గేట్స్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను అర్ధం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో విద్యాబోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందని చెప్పారు.
అలాగే, వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనదన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి కొత్త దశ, దిశ ఏర్పడుతుందన్నారు.ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్వన్ చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
పది సూత్రాలతో స్వర్ణాంధ్ర–2047..
కార్యక్రమంలో.. స్వర్ణాంధ్ర–2047 విజన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా తీర్చిదిద్దడం.. తలసరి ఆదాయం ప్రస్తుతం 3,400 డాలర్లు ఉండగా 2047 నాటికి దీనిని 42,000 డాలర్లకు పెంచడం.. ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు పెంచడం.. నిరుద్యోగాన్ని 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం.. మహిళా కారి్మకుల సంఖ్యను 45.8 శాతం నుంచి 80 శాతానికి పెంచడం లక్ష్యంగా సీఎం చెప్పారు. అనంతరం.. బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సేంద్రీయ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.
విమానం ల్యాండింగ్కు ఇబ్బందులు విమానాశ్రయం(గన్నవరం): గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్గేట్స్ ప్రయాణిస్తున్న విమానానికి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్గేట్స్ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 8.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగమంచు రన్వే ప్రాంతాన్ని కప్పివేసింది. దీంతో రన్వే విజిబులిటీ లేక విమానం 15 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. 8.30 గంటలకు పొగమంచు ప్రభావం తగ్గడంతో సురక్షితంగా రన్వేపై విమానం దిగింది.తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు.
చట్టాలను సరళతరం చేస్తాం
పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసే విషయమై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం సమీక్షించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలని ఆయన చెప్పారు.


