సమ్మెలో పాల్గొన్న 146 మంది నేతలకు వార్నింగ్ లెటర్లు
ఉక్కునగరం: ఈ నెల 12న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్న స్టీల్ప్లాంట్ కార్మిక నాయకులకు యాజమాన్యం వార్నింగ్ లెటర్లు జారీ చేసింది. దేశవ్యాప్త కార్మిక సమస్యలు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 12న దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఈ సమ్మెలో విశాఖ స్టీల్ప్లాంట్లో కూడా కొంతమంది పాల్గొన్నారు.
ఈ కారణంతో 146 మంది కార్మిక నాయకులు, కార్మికులకు యాజమాన్యం వార్నింగ్ లెటర్లు అందజేసింది. సమ్మెలోని అంశాలు రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద సయోధ్య దశలో ఉన్నందున సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన లేబర్ కోడ్లను అమలు చేయడం ద్వారా కార్మిక నాయకులకు వార్నింగ్ లెటర్లు ఇవ్వడంపై స్టీల్ప్లాంట్ కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


