త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య | YS Jagan mohan Reddy Fires on Chandrababu Naidu Govt: AP | Sakshi
Sakshi News home page

త్రిశంకుస్వర్గంలో ఉన్నత విద్య

Feb 20 2026 5:22 AM | Updated on Feb 20 2026 5:24 AM

YS Jagan mohan Reddy Fires on Chandrababu Naidu Govt: AP

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు

అతీగతీ లేని వసతి దీవెన.. విద్యా రంగాన్ని గాలికొదిలేసిన బాబు సర్కారు

నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

రూ.6,428 కోట్ల బకాయిలతో కలిపి ఈ ఏడాదిలో రూ.10,328 కోట్లు అవసరం

2026–27 బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.2,766 కోట్లే

బ్యాంకులు రుణాలివ్వక తగ్గిపోతున్న స్వయం సహాయక సంఘాల పరపతి

మా హయాంలో రూ.35,209 కోట్లతో అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం

ఈ ఇళ్లను తమ ఖాతాలో వేసుకుంటూ బాబు సర్కారు క్రెడిట్‌ చోరీ యత్నం 

ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం.. అధ్వానంగా గోరుముద్ద.. నాడు–నేడుకు ఉరి

సీబీఎస్‌సీ, ఐబీ, టోఫెల్, ఇంగ్లిష్‌ మీడియం, ట్యాబులు, సబ్జెక్టు టీచర్‌ విధానానికి మంగళం

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు 

ఉద్యోగులకు ఐఆర్‌ లేదు.. పీఆర్సీ లేదు.. నాలుగు డీఏలు పెండింగ్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పిల్లల చదువులపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై స్పష్టత లేకుండా చేసి చదువులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఒక త్రైమాసికం ముగిసిన వెంటనే మరో త్రైమాసికంలో తల్లుల ఖాతాల్లో వేసేవాళ్లం. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మేలో నిధులు విడుదల చేసేవాళ్లం. అయితే 2024 మార్చి 16న ఎన్నికల కోడ్‌ వచ్చింది.

మే 13 పోలింగ్‌ జరిగింది. అంతే, అక్కడితో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఏడాది మార్చి నాటికి 9 త్రైమాసికాలకు విద్యా దీవెనకు రూ.6,300 కోట్లు చెల్లించాలి. ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన కింద రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. ఎన్నికల పుణ్యంతో అది కూడా ఆగిపోయింది. 2024–2025 ఏప్రిల్‌ వరకు కలిపి రూ.2,200 కోట్లు వసతి దీవెన చెల్లించాలి. విద్యా దీవెన, వసతి దీవెన కలిపితే రూ.8,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,771 కోట్లు మాత్రమే విడుదల చేశారు.

ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోందని మరో రూ.1,200 కోట్లకు బీఆర్వోలు ఇచ్చారు. బీఆర్వో ఇచ్చిన వెంటనే పేమెంట్‌ ఇచ్చినట్టు కాదు. కాలేజీల ఖాతాల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పడ్డాయి. అంటే రెండేళ్లలో బాబు ఇచ్చింది రూ.2,071 కోట్లే. ఇంకా రూ.6,428 కోట్లు బాకీ పడ్డారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రూ.35,209 కోట్లతో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు 
⇒  అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్‌లలోనూ గజం స్థలం కొనడానికి పైసా కేటాయించ లేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. 

పైగా మా హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే, వాటిని కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తున్నాడు. 2024–25లో రూ.4,012 కోట్లు బడ్జెట్‌ పెట్టి రూ.1,548 కోట్లు ఖర్చు చేశారు. 2025–26లో రూ.6,300 కోట్లు (రివైజ్డ్‌ అంచనాలు) పెడితే రూ.1,928 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు గానీ, వాస్తంగా ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. 
వైఎస్సార్‌సీపీ హయాంలో జగనన్న కాలనీల్లో  మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం.  

నాడు–నేడుకు ఉరి 
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా మేము దేశంలోనే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే దానికి చంద్రబాబు ఉరి వేశారు. తొలి విడతలో 15,713 స్కూళ్లలో పనులు చేస్తే, రెండో విడతలో 22,312 స్కూళ్లలో దాదాపు పూర్తి చేసే దశకు తీసుకొచ్చాం. నాడు–నేడుకు రూ.8,524 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు చేశామని చంద్రబాబు ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. 
మరో రూ.4–5 వేల కోట్లు ఖర్చు పెడితే నాడు–నేడు పనులు అయిపోతాయి. కానీ, చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మూలన పడేశారు. ఆయన సుపుత్రుడి శాఖలో నాడు–నేడు కోసం 2024–25లో రూ.285 కోట్లు ఖర్చు చేస్తే, 2025–26లో రూ.1,500 కోట్లు కేటాయించి రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించారు గానీ, ఎంత ఖర్చు చేస్తారో చూడాలి. 

⇒   ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌సీ, ఐబీ, టోఫెల్‌ నిలిపివేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లిష్‌ మీడియం, ట్యాబులు, నాడు–నేడు ఎగిరిపోయాయి. సబ్జెక్టు టీచర్‌ విధానానికి మంగళం పాడేశారు. గోరుముద్ద పిల్లలు తినకుండా చేస్తున్నారు. కలుషిత నీరు తాగి, నాణ్యత లేని ఆహారం తిని 900 మంది పిల్లలు ఆస్పత్రుల్లో చేరారని జాతీయ పత్రికల్లోనూ వార్తలొస్తున్నాయి. ఇంత దారుణంగా విద్యా రంగాన్ని నడుపుతున్నారు.

ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు రూ.330 కోట్లు చొప్పున ఏడాదికి రూ.4 వేల కోట్లు వ్యయం చేయాలి. 2024–25, 2025–26 రెండేళ్లకు రూ.8 వేల కోట్లు వెచ్చించాలి్సన చోట చంద్రబాబు 2024–25లో రూ.2,259 కోట్లు, 2025–26లో రివైజ్డ్‌ అంచనాలు ప్రకారం రూ.3 వేల కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ మాత్రం రూ.2,600 కోట్లే ఇచ్చినట్టు చెబుతోంది. ఇంకా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3,141 కోట్ల బకాయిలు పెట్టింది. 2026–27లో రూ.4 వేల కోట్లతో కలిపితే మొత్తం రూ.7,200 కోట్లు ఆర్యోశ్రీకి అవసరం. వీళ్ల బడ్జెట్‌ చూస్తే పేదలను బతికించేలా కనిపించట్లేదు.  

2026–27 విద్యా సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు (త్రైమాసికానికి రూ.700 కోట్లు) రూ.2,800 కోట్లతో పాటు వచ్చే ఏప్రిల్‌లో వసతి దీవెనకు రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వ్యయం చేయాలి. దీనికి రూ.6,428 కోట్ల బకాయిలు కలిపితే రూ.10,328 కోట్లు నిధులు కావాల్సి ఉంది. అయితే బడ్జెట్‌లో పెట్టింది మాత్రం 
రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలాగైతే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? అసలు చదివే పరిస్థితి ఉంటుందా?

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న కాలనీల్లో  మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు ఖర్చు పెట్టి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశాం. ఇదే విషయంపై సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌లో లోక్‌సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.  
– వైఎస్‌ జగన్‌

మహిళలకు రుణ పరపతిలో క్షీణత 
⇒  డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి మూడు బడ్జెట్‌లలో అతీగతి లేదు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించి ఇవ్వకపోగా.. ఇంతకు ముందు ఇచ్చేది కూడా ఆపేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా 26,98,931 మందికి రూ.19,189 కోట్లు, ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు, కాపు నేస్తం కింద 3,58,613 మందికి రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4,95,269 మందికి రూ.1,876 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. 

⇒   స్త్రీలను శక్తిమంతులను చేసేలా వారి సాధికారత కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో చర్యలు చేపట్టాం. మేము అక్కచెల్లెమ్మల బాగు కోసం పరితపించి వారిని నిలబెట్టే కార్యక్రమం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో విచిత్రంగా పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. నాబార్డ్‌ డేటా చూస్తే.. 2023–24లో మహిళలకు రూ.49,626 కోట్లు పొదుపు రుణాలు ఉంటే, చంద్రబాబు హయాంలో 2025–26 పది నెలల్లో (డిసెంబర్‌ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. దానికి ముందు ఏడాది 2024–25లో రూ.41 వేలుగా ఉంది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో పరపతి తగ్గిపోతోంది.

స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ

ఉద్యోగులకు పైసా జీతం పెరగలేదు 
చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్‌ ఇస్తామన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. మూడు బడ్జెట్‌లు పెట్టినా ఉద్యోగులకు ఒక్క పైసా జీతం పెరగలేదు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇచ్చాం. ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ వేసి చైర్మన్‌ను నియమిస్తే వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చైర్మన్‌ను తీసేశారు. 

ఆయన త్వరగా రిపోర్టు ఇస్తే వెంటనే జీతాలు పెంచాలనే భయంతో, ఒకవైపు ఐఆర్‌ ఇవ్వకుండా మరో వైపున పీఆర్సీ చైర్మన్‌ తొలగించి, కొత్త పీఆర్సీని నియమించకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఇప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్, ఐఆర్‌ లేదు, పీఆర్సీ లేదు, ఒకటో తేదీ జీతాల ముచ్చట ఒక నెలతోనే అయిపోయింది. 

జీపీఎఫ్, ఏపీజీఎస్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవుల కింద దాదాపు రూ.35 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు పడ్డారు. 2024–25లో ఉద్యోగుల జీతాలు రూ.62,806 కోట్లు అయితే, 2025–26 రివైజ్డ్‌ అంచనాల ప్రకారం రూ.61,111 కోట్లు. అంటే జీతాలు పెరగాల్సింది పోయి తగ్గాయి. కొద్దో గొప్పో ఉద్యోగులు రిటైర్‌ అయ్యి ఉంటారు. హెచ్‌ఆర్‌ఏ 2024–25లో రూ.4,614 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.4,600 కోట్లకు తగ్గింది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.124 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పడిపోయింది. అలవెన్సులు, ఈఎల్, ఎస్‌టీసీ, ఓవర్‌టైమ్‌ అలవెన్స్‌లు రూ.2,415 కోట్లు అయితే ఇప్పుడు రూ.1,316 కోట్లకు క్షీణించింది. ఉద్యోగుల బేసిక్‌ పే రూ.35,671 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35,345 కోట్లుగా మాత్రమే ఉంది.  

ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, ఐఆర్, అలవెన్స్‌ చెల్లింపు తదితరాలపై మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement