చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వంపై కదంతొక్కిన ఆశ వర్కర్లు
రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు
రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో విజయవాడకు రాక.. నినాదాలతో దద్దరిల్లిన బెజవాడ ధర్నా చౌక్
వెట్టిచాకిరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా రణన్నినాదం.. రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్
ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు కూటమిపై ఐక్య పోరాటాలకు సంసిద్ధం
ప్రభుత్వ విధానాలను మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
ఉక్కు సంకల్పంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై టెంట్లలోనే కూర్చొని నిరసన
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు.
సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు.
ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం
గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేతనాలు పెంచాలి..
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 
విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు
ఆశాల పోరాటం వాయిదా
ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.
కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి.
– ఎ.కమల, భవానీపురం, విజయవాడ
ఉద్యోగ భద్రతేదీ?
మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి.
– బి.సరళ, చింతలపూడి
ఎలా బతకాలి?
కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి?
– సీహెచ్ పద్మ, కాకినాడ
సెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే
ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది.
– ఎం.రాధ ధవళేశ్వరం


