తాడేపల్లి: ఏపీలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. పదే పదే అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హత్య చేసి డ్రమ్ములో కక్కేసినా ప్రభుత్వం చోద్యం చూస్తుందోని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు కూడా ఇలాంటి నేరాలకు కారణమన్నారు.
హోంమంత్రి అనిత బిల్ గేట్స్తో ఫోటోలు దిగటం మీద చూపే శ్రద్ద నేరాల నిరోధానికి చూపటం లేదని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ఏపీలో రోజుకు 70 నుంచి 80 శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నారా లోకేష్ కొలంబో వెళ్ళి క్రికెట్ చూస్తున్నాడు. హిందూపురంలో బాలకృష్ణ అనుచరుడు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు.
అనపర్తిలో ఆరో తరగతి బాలిక మీద టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులకు దిగితే నేరస్తుడుకే పోలీసులు వత్తాసు పలికారు. పోలీసులను ఈ ప్రభుత్వం ఎందుకు వాడుకుంటోంది?, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా హోంమంత్రి ఒక్క చోటకు కూడా ఎందుకు పరామర్శకు వెళ్లలేదు?, మదనపల్లె కేసులో నిందితుడి మీద గతంలో కేసులు ఉన్నాయి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కావు కదా?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ నేరాలకు ఏం సమాధానం చెప్తారు?, భవిష్యత్తు మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం అప్పులు తెచ్చింది. దాంతో జనంతో బలవంతంగా తాగిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు ఇక రక్షణ లేనట్టే. కూటమికి ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు చేసేది ఇదేనా?’ అని నిలదీశారు.


