అన్నమయ్య : మదనపల్లిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలికను దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతోంది. కొన్ని గంటలుగా కదిరి- మదనపల్లి హైవే దిగ్బంధించి స్థానికులు ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి. ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ స్థానికులు మాత్రం నిందితుడ్ని ఉరి తీయాలనే డిమాండ్తో నిరసన చేపట్టారు.

కాగా, మదనపల్లిలో అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతమైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచాడు నిందితుడు. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా(7)ను హత్య గావించబడింది. తొలుత బాలిక కన్పించకపోవడంపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

దీనిలో భాగంగా బాలిక ఆచూకీ తెలపాల్సిందిగా పత్రికా ప్రకటన ఇచ్చారు పోలీసులు. ఆపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సీఐ మహమ్మద్ రఫీ, సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక హత్యగావించబడినట్లు తేలింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి, హత్య జరిగినట్లు నిర్ధారించారు.
అనుమానితుడి ఇంటిని చుట్టిముట్టి..
మదనపల్లెలో ఆందోళన కొనసాగుతోంది. అనుమానితుడి ఇంటిని స్థానిక గ్రామస్తులు చుట్టుముట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాంఢ్ చేస్తున్నారు. ఎస్పీతోపాటు పోలీసులు ఎంత సర్ది చెబుతున్న బాధితులు మాత్రం వినడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బాలిక శవాన్ని బయటకి తీయలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క నిందితుని కఠినంగా శిక్షించాలంటూ అన్నమయ్య సర్కిల్లో కొనసాగుతున్న రాస్తారోకో కొనసాగుతోంది.పాప తల్లితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హోంమంత్రి చెప్పారు. అనుమానితుడి ఇంటి చుట్టూ ప్రజలు ,హిజ్రాలు, ప్రజాసంఘాల నాయకులు భారీగా చుట్టుముట్టారు. కర్నూలు డీఐజీ సైతం ఘటనా స్థలికి బయల్దేరి వస్తున్నట్లు తెలుస్తోంది.



