సాక్షి, తూర్పుగోదావరి: అంబటి ఇంటిపై జరిగిన దాడి.. కక్ష పూరిత రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాంబాబును హతమార్చాలని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టారు.. దాడికి పాల్పడినవారు ప్రేరేపించినవారు.. బయట తిరుగుతున్నారు... ఇది రాష్ట్రంలో రాజ్యాంగం’’ అంటూ మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పబ్లిసిటీ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే రాష్ట్రంలో చేస్తున్నారు. బడ్జెట్లో కనీస అవగాహన ఉన్న కూర్పు కూడా లేదు. రాష్ట్ర చరిత్రలో దారుణమైన బడ్జెట్ ఇదే.. అప్పు మాత్రమే కనబడుతుంది. అప్పు తీసుకొచ్చిన సొమ్ము ఏమయిపోయిందో చంద్రబాబుకు, లోకేష్కు తప్ప ఎవరికి తెలియదు’’ అంటూ అమర్నాథ్ మండిపడ్డారు.
‘‘గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో రెండు లక్షల 70 వేల కోట్లు డీబీటి కింద పేదల అకౌంట్లో వేశారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇవ్వాలి. సరాసరిన రోజుకు 500 కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఏ ఒక్క రంగానికి సరైన కేటాయింపులు లేవు. యూరియా కోసం రైతుల రోడ్లమీద కొట్టుకుంటున్నారు. 6000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు సిలిండర్లు వంటి ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదు.
ఒక్క పథకం అమలు చేయకుండా అంబటి వంటి నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు బిల్ గేట్స్ని కాదు కదా ఎవరు తీసుకొచ్చినా ఏమంటుంది?. జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.
ఏపీలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది: కరణం ధర్మశ్రీ
రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది. చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. కేవలం తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించేందుకే అంబటి రాంబాబును జైలు పాలు చేశారు. బడ్జెట్ బుక్ అంతా వట్టి డొల్ల. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో సమాధి కడతారు


