అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు దివంగత జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో తాజాగా విడుదలైన పత్రాలు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 'ఎప్స్టీన్ ఫైల్స్'లో వెల్లడవుతున్న అంశాలు క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. భారతదేశంలోఆధ్యాత్మికతకు చిహ్నంగా భావించే మొక్కను నేరగాడు ఇంత దారుణమైన పనుల కోసం వాడిన వైనం దిగ్భ్రాంతి రేపింది.
ఇటీవల విడుదలైన ఈమెయిల్స్ ప్రకారం ఎప్స్టీన్ ఫైల్స్లో "జోంబీ ఫ్లవర్" ప్రస్తావన బహిరంగ చర్చకు గురిచేసింది. ఎప్స్టీన్ తన నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్స్ (Trumpet Plants) పెంచేవాడని తెలుస్తోంది. 2014 - 2015 నాటి ఇమెయిల్స్లో తన "నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్లు" గురించి అడిగినట్టు, "స్కోపోలమైన్: మనిషి ఆలోచనా శక్తిని నశింపజేసే శక్తివంతమైన డ్రగ్" అనే శీర్షికతో ఉన్న సమాచారాన్ని ఎప్స్టీన్ ఫార్వార్డ్ చేశాడు.
అసలేంటీ జోంబీ ఫ్లవర్
వీటిని సాధారణంగా ఏంజెల్స్ ట్రంపెట్ లేదా డెవిల్స్ బ్రీత్ (Devil's Breath) అని పిలుస్తారు. ఇది అందమైన కానీ అత్యంత విషపూరితమైన మొక్క. వీటి పుష్పాలనే జోంబీ ఫ్లవర్ అని పిలుస్తారు. ఈ మొక్క బ్రుగ్మాన్సియా లేదా డాతురా జాతికి చెందినది. దీని ప్రభావంతో జ్ఞాపకశక్తి కోల్పోవడం, పూర్తిగా పట్టు కోల్పోవడం, మగత, కొన్నిసార్లు సంఘటనలను గుర్తుకు తెచ్చుకోలేరు కూడా.
ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్డే రోజే హత్య
స్కోపోలమైన్ ప్రభావం
స్కోపోలమైన్ (Scopolamine)అనేదిఈ మొక్కల నుండి తీసే మందు. దీన్నే "డెవిల్స్ బ్రీత్" లేదా "జాంబీ డ్రగ్" అని పిలుస్తారు. ఇది తీసుకున్న మనిషిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని ప్రభావంలో ఉన్న వ్యక్తి ఎదుటివారు చెప్పినట్లు వింటాడు, వారు అడిగినవన్నీ ఇస్తారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. దీంతో ఈ డ్రగ్ను నేరపూరిత పనుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
విష స్వభావం
ఈ మొక్కలను సాధారణంగా బ్రగ్మాన్సియా (Brugmansia) మరియు దత్తూర (Datura) అని పిలుస్తారు. ఇవి పెద్ద తుత్తూరు (Trumpet) ఆకారంలో ఉండి, చూడటానికి అందంగా ఉంటాయి. కానీ వీటి ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ అత్యంత విషపూరితమైనవి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన భ్రాంతులు (Hallucinations), కండరాల బలహీనత, రక్తపోటు పెరగడం, పక్షవాతం, మరణం కూడా సంభవించవచ్చు. కొలంబియాలో దీనిని 'బురుండంగా' అని పిలుస్తారు, అక్కడ నేరస్థులు బాధితులను లొంగదీసుకోవడానికి దీనిని ఎక్కువగా వాడుతుంటారు.
శివుడికి ప్రీతి పాత్రం
హిందూ తత్వశాస్త్రంలో దత్తూర (ఉమ్మెత్త) చాలా భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది శివుడికి పవిత్రమైనది. హిందూ పురాణాల ప్రకారం, ఉమ్మెత్త పువ్వులు, కాయలు పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. క్షీరసాగర మథనం సమయంలో పుట్టిన విషాన్ని (హాలాహలం) శివుడు మింగి లోకాన్ని రక్షించాడు. ఆ విష ప్రభావాన్ని తట్టుకోవడానికి ఉమ్మెత్త వంటి వనమూలికలను ఆయనకు సమర్పిస్తారని చెబుతారు. మనలోని విషపూరిత మైన ఆలోచనలను, అహంకారాన్ని దేవుడికి సమర్పించి నిర్మలమైన మనస్సును పొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.
ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్


