AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్‌ | AI must be developed and deployed for the larger public good | Sakshi
Sakshi News home page

AI Summit 2026: ప్రపంచానికి దిక్సూచిగా భారత్‌

Feb 17 2026 1:40 PM | Updated on Feb 17 2026 1:52 PM

AI must be developed and deployed for the larger public good

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు రెండో రోజు(మంగళవారం) అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుడి సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

అందుబాటులోకి ఏఐ కళ్లద్దాలు
ఈ సందర్భంగా భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘సర్వం కాజే’ (Sarvam Kaze) అనే ఏఐ వేరబుల్ పరికరాన్ని ధరించి ఆయన స్వయంగా పరీక్షించారు. ఇది చూడడానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యాధునిక ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. రాబోయే మే నెల నుంచి ఈ స్వదేశీ పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని సదస్సులో ప్రతినిధులు వెల్లడించారు.

విద్యా రంగంలో సరికొత్త విప్లవం
భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాబోయే  కాలంలో డేటా సెంటర్ల రంగంలో సుమారు 200 బిలియన్ డాలర్ల(రూ.18.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. మరోవైపు, విద్యా రంగంలో ఏఐ పాత్రపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, రాబోయే తరానికి ఏఐ ఆధారిత విద్యను అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

చాట్ జీపీటీతో భారత్‌కు అత్యధిక ప్రయోజనం
జోహో (ZOHO) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏఐ ఒక అద్భుతమైన ‘లెర్నింగ్ బూస్టర్’లా పనిచేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇది గొప్ప సాధనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిలో సమానత్వం ఉండాలని, లేకపోతే ప్రపంచ సమాజంలో తీవ్ర అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ హెచ్చరించారు. చాట్ జీపీటీ (ChatGPT) వంటి సంస్థలకు అమెరికా కంటే భారత్ 33 శాతం ఎక్కువ డేటాను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు.
 

ఏఐతో మరిన్ని ఉపాధి అవకాశాలు
గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం డేటాను అందించే వనరులుగా మాత్రమే మిగిలిపోకూడదని, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాల్లో వీరికి సమాన వాటా దక్కాలని ప్యానెల్ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ సాంకేతికత కొత్త తరహాలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమితాబ్ కాంత్ అన్నారు.
 

చిన్నారుల భద్రతపై కీలక చర్చలు
ఈ మెగా సమిట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. బిల్ గేట్స్ ఈ సదస్సులో పాల్గొంటారని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేయగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా హాజరుకానున్నారు. సుమారు 20 దేశాల అధినేతలు, 60 మందికి పైగా మంత్రులు ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సదస్సులో భాగంగా చిన్నారుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి. వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని నిపుణులు సూచించారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అయితే డిజిటల్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement