జెరూసలేం: ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఆదివారం అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రధాని మోదీ పర్యటన వివరాలను తొలిసారిగా మీడియాకు బహిర్గతం చేశారు. ‘‘మన నెసెట్(పార్లమెంట్)నుద్దేశించి ఒక ముఖ్యనేత ప్రసంగించబోతున్నారు. వచ్చే వారం ఇక్కడికి ఎవరొస్తున్నారో తెలుసా? నరేంద్ర మోదీ’’అంటూ మోదీ పర్యటనను నెతన్యాహూ ప్రకటించారు.
‘‘భారత్తో మన బంధం గొప్పది. అన్ని రంగాల్లో సహకారంపై విస్తృతస్థాయిలో మోదీతో చర్చించబోతున్నా. మీరిప్పుడొకటి తెల్సుకోవాలి. భారత్ ఏరకంగానూ చిన్న దేశం కాదు. వాళ్ల జనాభా ఏకంగా 140 కోట్లు. భారత్ ఇప్పుడు శక్తివంతమైన, పరపతి గల దేశంగా ఎదుగుతోంది’’అని అన్నారు. 2017 జూలైలో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించి యూదు దేశంలో అడుగుపెట్టిన తొలి భారతీయ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోదీ పర్యటించబోతున్నారు.


