ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్‌పో! | AI Summit India 2026: PM Narendra Modi inaugurates India AI Impact Expo | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్‌పో!

Feb 17 2026 6:19 AM | Updated on Feb 17 2026 6:19 AM

AI Summit India 2026: PM Narendra Modi inaugurates India AI Impact Expo

ప్రారంభించిన ప్రధాని మోదీ 

పారిశ్రామిక, ఏఐ ప్రముఖుల రాక

ఏఐ ప్రభావంపై విస్తృత చర్చలు 

సమస్యల పరిష్కారాలపై దృష్టి

ఐదు రోజుల పాటు ఎక్స్‌పో 

పాల్గొననున్న దేశాధినేతలు 

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పలు కంపెనీలు, స్టార్టప్‌లు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన కలియదిరిగారు. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులతో మాటలు కలిపారు. వారి పరిశోధనలు తదితరాలను గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ దాకా జరిగే ఈ ఐదు రోజుల సదస్సులో 600కు పైగా భారీ స్థాయి స్టార్టప్‌లు పాలుపంచుకోనున్నాయి. వాటితో పాటు 13 దేశాలకు చెందిన ఏఐ పెవీలియన్లు తమ ప్రత్యేకతను చాటేందుకు సిద్ధమయ్యాయి. 

గ్లోబల్‌ సౌత్‌లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు 20 మందికి పైగా దేశాధినేతలు, 60కి పైగా దేశాల నుంచి మంత్రులు పాల్గొంటున్నారు. అంతేగాక గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో పాటు పలు ఏఐ దిగ్గజ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు కూడా హాజరై ఈ రంగంలో విస్తరణకు అమలు చేయదలచిన ప్రణాళికలు తదితరాలను ఆహూతులతో పంచుకోనున్నారు. 

19వ తేదీన సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అదే తేదీన మాక్రాన్‌ కూడా సదస్సులో పాల్గొంటున్నారు. భారత్‌కే గాక ప్రపంచమంతటికీ పలు రంగాలకు సంబంధించిన కీలక సవాళ్లకు ఈ సదస్సు సమర్థమైన పరిష్కారాలు చూపగలదని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు.

 ఇన్నొవేటర్లు, పరిశోధకులు, టెక్‌ ఔత్సాహికుల నడుమ గడపడం ఎనలేని ఆనందాన్ని ఇచి్చనట్టు ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇండియా ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించా. ఇంతటి కీలకమైన సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తుండటం హర్షణీయం’’అన్నారు. ‘గ్లోబల్‌ ఏఐ గవర్నెన్స్‌’కు ఈ సదస్సు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందజేస్తుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. అంతకుముందు వేదిక వద్ద జియో ఏఐ ఎకో సిస్టమ్స్‌ స్టాల్‌ను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు. 

తొలి రోజు విస్తృత చర్చలు 
ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోకు కేంద్రం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారత్‌ మండపంలో 10 వేదికల్లో 70 వేల చదరపు మీటర్లకు పైగా విస్తరించిన ప్రాంతంలో స్టాళ్లు, స్టార్టప్‌లు, ఏఐ వేదికలు కనువిందు చేస్తున్నాయి. సోమవారం ఉదయానికే భారీ సంఖ్యలో తరలివచి్చన పలు ప్రఖ్యాత ఏఐ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు తదితరులతో వేదికతో పాటు పరిసరాల్లోని హాల్లన్నీ నిండిపోయాయి. 

వారంతా బృందాలుగా ఏర్పడి పలు రంగాల్లో ఏఐ ప్రభావం, దాని మంచిచెడులను గురించి చర్చోపచర్చల్లో మునిగితేలారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రపంచ స్థాయి దిగ్గజ ఏఐ సంస్థలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి పరస్పరం అనుభవాలు, అభిప్రాయాలను పంచుకోనున్నాయి. 

ఏఐ దెబ్బకు పలు రంగాల్లో భారీగా కొనసాగుతున్న కొలువుల కోత మొదలుకుని బాలల భద్రత దాకా భిన్నమైన అంశాలు, సమస్యలపై చర్చలు, పరిష్కార మార్గాల అన్వేషణకు సదస్సు వేదిక కానుంది. 13కు పైగా దేశాలు ఇప్పటికే మండపంలో ప్రత్యేక పెవీలియన్లు ఏర్పాటు చేశాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజకిస్తాన్‌ వంటివి వీటిలో ఉన్నాయి. 300కు పైగా క్యూరేటెడ్‌ ఎగ్జిబిషన్‌ పెవీలియన్లు ఆకట్టుకోనున్నాయి. ‘పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్‌’ థీమ్‌తో కూడిన లైవ్‌ డెమాన్‌్రస్టేషన్లు కంపెనీల ఏఐ ప్రణాళికలను కళ్లకు కట్టనున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా ఏఐ సదస్సును సందర్శిస్తారని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement