గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు! | Middle East War Clouds Disrupt LPG Supply Crippling Gig Economy Food Delivery | Sakshi
Sakshi News home page

గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!

Mar 16 2026 11:27 AM | Updated on Mar 16 2026 11:35 AM

Middle East War Clouds Disrupt LPG Supply Crippling Gig Economy Food Delivery

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.

అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలు

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్‌ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

తగ్గిన ఆర్డర్లు..

రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్‌ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.

ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలు

కేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.

ప్రభుత్వ జోక్యం అవసరం

గ్యాస్‌ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్‌ఈస్ట్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్‌పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.

ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement