సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆకుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.
అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీనితో ఆ కుటుంబంలో ఒక్కరూ మిగలకుండా అందరూ తుడిచిపెట్టుకు పోయారు.
శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.
ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.
తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానే
ఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం.


