సైకిల్ తొక్కే పోస్టుమ్యాన్ కనిపించరు! | Postman started using motor vehicle instead of bicycle | Sakshi
Sakshi News home page

సైకిల్ తొక్కే పోస్టుమ్యాన్ కనిపించరు!

Feb 8 2026 6:18 AM | Updated on Feb 8 2026 6:18 AM

Postman started using motor vehicle instead of bicycle

ఉత్తరాల బట్వాడాను కేంద్రీకరించిన తపాలాశాఖ

ఐదారు పోస్టాఫీసులకు ఓ కేంద్రం ఏర్పాటు 

దీంతో సైకిల్‌ వదిలి మోటారువాహనం వాడాలని సూచన 

ఈ–బైకులు ఇస్తామని హామీ.. 

ఇప్పటి వరకూ నెరవేరని వైనం

ఖాకీ రంగు యూనిఫామ్‌.. మెడలో సంచీ.. సైకిల్‌ మీద ప్రయాణం... పోస్ట్‌మ్యాన్‌ అనగానే ఠక్కున స్ఫురించే దృశ్యమిది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా, సైకిల్‌ మీద ఇంటింటికి వెళ్లి ఉత్తరాలు ఇవ్వడం సాధారణ విషయం. ఇటీవలి కాలంలో సైకిళ్లను వదిలి అంతా మోటారు వాహనాల వైపు మళ్లినా.. ఇంటింటికి వెళ్లాల్సి రావటం, తపాలా డబ్బాల వద్ద ఆగి క్లియర్‌ చేయాల్సి రావటం వల్ల పోస్ట్‌మ్యాన్‌ మాత్రం సైకిళ్లనే నమ్ముకున్నారు. కొత్తగా విధుల్లో చేరిన యువతరం కొందరు తప్ప సింహభాగం పోస్ట్‌మ్యాన్‌లు సైకిల్‌తోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సావాసం ఇకపై ముగియనుంది. తపాలా శాఖ చేసిన మార్పులతో వారు సైకిల్‌కు బైబై చెప్పనున్నారు.

కేంద్రీకృత డెలివరీ విధానంతో..
ఇంతకాలం ఏ తపాలా కార్యాలయానికి ఆ తపాలా కార్యాలయం ఉత్తరాల బట్వాడాతో కొనసాగేవి. ఉత్తరాలు/కవర్లు/ ఇతర పార్సిళ్లు నేరుగా ఆ పోస్టాఫీసుకే వచ్చేవి. అక్కడి పోస్ట్‌మ్యాన్‌ వాటిని సారి్టంగ్‌ చేసి సంబంధిత చిరునామాల్లో డెలివరీ చేసేవారు. గత సెప్టెంబర్‌లో తపాలాశాఖ కొత్త విధానాన్ని తెచి్చంది. ప్రతి పోస్టాఫీసులో డెలివరీ సెంటర్‌ లేకుండా.. ఆ ప్రాంతంలోని ఏడెనిమిది తపాలా కార్యాలయాలకు కలిపి ఒక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాని పరిధిలోని పోస్ట్‌మ్యాన్‌ అక్కడికే వచ్చి సారి్టంగ్‌ చేసుకుని తమ పరిధిలోని ఉత్తరాలు/పార్సిళ్లను తీసుకెళ్లి డెలివరీ చేయాలి.

కనీసం 10 కి.మీ.కు పైగా దూరం వెళ్లి వారు ఈ తంతు నిర్వహించాలి. దీంతో సైకిళ్లు వదిలి మోటారు వాహనాలు వాడాలని తపాలాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు తనే ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఇస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈ కేంద్రీకృత డెలివరీ విధానం నగరాలు, పెద్ద పట్టణాలతో మొదలైంది. పోస్టల్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌లో, పోస్ట్‌మ్యాన్‌కు సైకిల్‌ ఉండాలన్న అంశం ఉంటూ వచి్చంది. ఇప్పుడు టూవీలర్‌ లైసెన్స్‌ ఉండాలి అని చేర్చారు. ఫలితంగా హైదరాబాద్, వరంగల్‌లలో సైకిళ్ల మీద తిరిగే పోస్ట్‌మ్యాన్‌ కనిపించడం లేదు. త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం మాయం కానుంది.  

ఆందోళన బాటలో...
ఎక్కడో 10 కి.మీ. దూరంలో ఉన్న డెలివరీ కేంద్రానికి వెళ్లి లేఖలు తెచ్చుకోవటం కోసం సైకిళ్లకు బదులు మోటారు వాహనాలు వాడాలని పేర్కొన్న తపాలాశాఖ, వారికి ఇస్తానన్న ఎలక్ట్రిక్‌ బైకులను మాత్రం ఇవ్వలేదు. దీంతో సొంత వాహనాలను వాడాల్సి వస్తోంది. ఇందుకు పెట్రోల్‌ ఖర్చు చెల్లించటం లేదు. ఇది తమకు భారమవుతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కొత్త డెలివరీ విధానంలో సంబంధిత చిరునామాకు వెళ్లిన తర్వాత యాప్‌ ద్వారా పార్సిల్‌ మీద ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అది పోస్టాఫీసులో రికార్డు అవుతుంది. నిర్ధారిత సమయంలోనే డెలివరీ అయిందని నిర్ధారించుకునేందుకు ఈ విధానం పెట్టారు. దీనికి మొబైల్‌ డేటా కోసం ప్రతి నెలా రూ.350 చెల్లించాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు.  

 వీటిపై ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేసినా పట్టించుకోకపోవటంతో త్వరలో «వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అప్పటికీ స్పందన రాకపోతే సమ్మెకు సిద్ధమని పోస్ట్‌మ్యాన్‌ సంఘం ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement