‘ప్రాణహిత – చేవెళ్ల’ను పునరుద్ధరిస్తాం | Land acquisition for KP Lakshmidevipalle project soon: Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత – చేవెళ్ల’ను పునరుద్ధరిస్తాం

Feb 8 2026 5:58 AM | Updated on Feb 8 2026 5:58 AM

Land acquisition for KP Lakshmidevipalle project soon: Revanth Reddy

కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు త్వరలోనే భూసేకరణ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

వైఎస్సార్‌ ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కేసీఆర్‌ రద్దు చేసిండు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కిషన్‌రావుగా మారిపోయిండు 

పరిగి ప్రజాపాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌: దివంగత సీఎం వైఎస్సార్‌ డిజైన్‌ చేసి, శిలాఫలకం వేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పిన సబితమ్మ కేసీఆర్‌తో ప్రాణహిత– చేవెళ్లను ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నారాయణ్‌పూర్‌ శివారులో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాకు 300 టీఎంసీల నీరు ఇవ్వటానికి చేతకాలేదా..? ప్రాజెక్టు డిజైన్‌ మార్చి ఉమ్మడి జిల్లా పొలాలను ఎండబెడుతుంటే సబితమ్మ ఏం చేశారని ఎద్దేవా చేశారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే భూసేకరణ చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ పక్క బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి జిల్లాకు నీరందించేందుకు దివంగత నేత వైఎస్సార్‌ ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కేసీఆర్‌ రద్దు చేశాడని విమర్శించారు. గోదావరి జలాలను తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్‌ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతగిరిలో టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఓ సంస్థతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. వికారాబాద్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా మీదుగా ట్రిపుల్‌ఆర్‌ నిర్మించటంతోపాటు ఓఆర్‌ఆర్‌ టు జిల్లా వరకు రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. 

వారివి చీకటి ఒప్పందాలు 
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు ఎవరికి తెలియనివి? బీజేపీ వాళ్ల బీ ఫారంలు బీఆర్‌ఎస్‌ ఆఫీసులో ఇస్తున్నారు. ఇది తాండూరులో రుజువైంది’అని సీఎం రేవంత్‌ అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..కల్వకుంట్ల కిషన్‌రావు అని రాసుకుంటే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్‌ అన్ని వర్గాలను వంచించారని, ఆయన ఎస్సీలను సీఎం చేస్తానని వంచిస్తే, మేము ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌ చేశాం.. ఆ సామాజిక వర్గాలకు మంత్రి పదవులిచ్చామని సీఎం స్పష్టం చేశారు. 

చెరిగిపోని నీచ చరిత్ర కేసీఆర్‌ది..
కేసీఆర్‌ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు, కేటీఆర్‌ తనను విమర్శిస్తున్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘కేసీఆర్‌ది దొంగనోట్లు, పాస్‌పోర్టు బ్రోకర్ల చరిత్ర .. ఆ చరిత్ర నేను చెరిపేస్తే పోయేదా? కేసీఆర్‌పై దొంగనోట్ల కేసు నమోదైందని మీ పక్కన ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమారే చెప్పిండు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిపినా చెరిగిపోదు.. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. కావాలంటే ఆ చరిత్రను మావాళ్లకి చెప్పి గోడలపై రాయించి భద్రపరుస్తా’అని సీఎం ఎద్దేవా చేశారు. 

రంజిత్‌రెడ్డిని మున్సిపల్‌ మంత్రిని చేస్తా..
చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో రంజిత్‌రెడ్డిని గెలిపించి ఉంటే ఢిల్లీలో మన బలం పెరిగి ఉండేదని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా, రంజిత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి మీకు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఇస్తామన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రిని చేసి ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీధర్‌బాబు, శాసనమండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత, పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement