414 డివిజన్లలో 2,195 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బహు ముఖ పోటీ నెలకొంది. 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా, 2,195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 12 చోట్ల ద్విముఖ, 48 డివిజన్లలో త్రిముఖ పోరు జరుగుతోంది. మిగతా డివిజన్లలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్న పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. 47% డివిజన్లలో నలుగురు లేదా ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16.4%డివిజన్లలో ఐదుగురు అభ్యర్థులు చొప్పున పోటీ పడుతున్నారు.
రామగుండంలో జనరల్ మహిళకు రిజర్వు అయిన 1వ వార్డు నుంచి మడిపెల్లి విజయం, మహబూబ్నగర్లో జనరల్ మహిళకు రిజర్వు చేసిన 58వ వార్డు నుంచి బి.రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామగుండం 48వ డివిజన్, కొత్తగూడెం 42వ డివిజన్, నిజామాబాద్ 33వ డివిజన్లో అత్యధికంగా 13 మంది అభ్యర్థులు చొప్పున పోటీ పడుతున్నారు.


