దూకుడు పెంచాలి.. ప్రచారానికి మిగిలింది రెండు రోజులే..
నేతలు, కార్యకర్తలకు బీజేపీ ఆదేశాలు
విజయమే లక్ష్యంగా సమర శంఖం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్షేత్రం ఇప్పుడు రణరంగంగా మారింది. ప్రచార గడువు ముగియ డానికి కేవలం రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో, రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీజేపీ తన దూకుడును అమాంతం పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి లభి స్తున్న అపూర్వ స్పందనను చూస్తుంటే గెలుపుపై ధీమా పెరుగుతోందని, ఈ సానుకూల వాతావరణాన్ని ఓట్ల రూపంలోకి మలచడమే తక్షణ కర్తవ్యమని పార్టీ శ్రేణులకు నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
అంతర్గత నివేదికల ప్రకారం..
కనీసం 3 కార్పొరేషన్లు, 30 నుంచి 40 మున్సిపాలి టీల్లో కమలం జెండా ఎగురవేసేందుకు పరిస్థితు లు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ గెలుపు అవకాశాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ రాష్ట్ర పార్టీ అభ్యర్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా వర్గీ కరించింది. కచ్చితంగా గెలిచే స్థానాలను ‘ఏ’ గ్రేడ్లో ఉంచి, అక్కడ పోలింగ్ బూత్ స్థాయి మేనేజ్ మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉన్న ‘బీ’ గ్రేడ్ వార్డులలో ఉన్న లోటుపాట్లను అధిగమించేందుకు వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. స్థానిక నాయకులు, తటస్థులు, మీడియా వర్గాల సమాచారాన్ని ధ్రువీకరించుకుంటూ.. ఈ వర్గీకరణను పటిష్టం చేశారు.
దిగ్గజ నేతల వ్యూహ రచన
ఈ రాజకీయ సమరంలో దిగ్గజ నేతలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పరిధిలో, ఎంపీ అర్వింద్æ ధర్మపురి నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఇప్పటికే సొంత సర్వేల ద్వారా బలాబలాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇదే బాటలో ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణ ముమ్మరం చేశారు.
సుడిగాలి పర్యటనలు
ప్రచార ముగింపు సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆదివారం హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కొత్తగూడెం, కోదాడ, నల్లగొండలలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. చివరి రోజైన సోమవారం నిజామా బాద్లో ఆయన పర్యటన ఉండగా, కరీంనగర్లో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ ప్రచార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు ప్రతి ఇంటినీ తాకుతూ, భారీ రోడ్డు షోలతో మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా బీజేపీ సర్వసన్నద్ధమైంది.


