అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అధికార కాంగ్రెస్కు మిత్రపక్షంగా సీపీఐ
కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం ప్రత్యర్థులుగా పోటీ
సీట్ల పంపకంలో కుదరని సర్దుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షా లుగా కొనసాగుతున్నాయి. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రత్యర్థులుగా మారాయి. బల్దియా పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పొడిచింది. అందులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సీపీఐ తర ఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు సీపీఐ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అనేక కీలక అంశాల్లో ప్రభుత్వ విధానాలకు కూనంనేని మద్దతుగా నిలిచారు. రెండేళ్లుగా సజావుగా కొనసాగుతున్న కాంగ్రెస్ – సీపీఐ దోస్తీకి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్పర్థలు మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త గూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉన్న విద్యానగర్ పంచాయతీని సీపీఐ ఏకగ్రీవం చేసుకుంది.
సర్దుబాటు కాలేదంటూ...
కొత్తగూడెంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఎక్కువ డివిజన్ల నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి హస్తం నేతలు వచ్చారు. దీంతో కొత్తగూడెంలోని 60 డివిజన్లలో మిత్రపక్షమైన సీపీఐకి 15 డివిజన్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కానీ పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో తమకు సంస్థాగతంగా బలం ఉన్నందున 25 డివిజన్లకు తక్కువ కాకుండా చూడాలని సీపీఐ డిమాండ్ చేసింది.
ఈ అంశంపై అనేకమార్లు చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్ – సీపీఐ స్నేహబంధానికి బీటలు వారినట్ట య్యింది. సీపీఎంతో జోడీ కట్టిన కాంగ్రెస్ 58 డివిజన్లలో పోటీకి నిలిచింది. ఇక టీడీపీతో దోస్తీ చేసిన సీపీఐ 57 డివిజన్ల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.
మేమే చేస్తాం.. మేమే తెచ్చాం
కూనంనేని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే కొత్తగూడెం కార్పొ రేషన్గా అప్గ్రేడ్ అయిందని, 20 ఏళ్లుగా ఎన్నికలు లేని పాల్వంచలో ఇప్పుడు పోలింగ్ జరుగుతోందని సీపీఐ ప్రచా రం చేస్తోంది. డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ కూడా మంజూరైందని, ఇదే వేగం కొనసాగాలంటే సీపీఐకే పట్టం కట్టాలనే నినాదంతో ఎర్రదండు ముందుకు కదులుతోంది.
కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి తన భుజాలకు ఎత్తుకు న్నారు. కొత్త పరి శ్రమలు రావాలన్నా, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కావా లన్నా అది కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన ప్రచారం చేస్తున్నారు.


