ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న హరీశ్రావు
జిన్నారం ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి హరీశ్రావు
జిన్నారం (పటాన్చెరు)/గజ్వేల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ది ఉద్యమ చరిత్ర అయితే, ముఖ్యమంత్రి రేవంత్ది ద్రోహ చరిత్రని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్కు మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి అని విమర్శించారు.
చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో హరీశ్రావు ఆర్అండ్ఆర్ కాలనీకి రాకుండానే తూప్రాన్కు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఇక్కడికి చేరుకొని సభను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం చెప్పులు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.


