టీ–20 ప్రపంచకప్ మ్యాచ్లో మెరిసిన ముక్కమల్ల సాయితేజ
సంజామల: వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ టీ–20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భాగంగా ఇండియాతో తలపడిన అమెరికా(యుఎస్ఏ) జట్టు తరఫున బరిలో దిగాడు. సాయితేజకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే హైదరాబాద్లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు.
2022లో 18 ఏళ్ల వయసులో యుఎస్ఏ జాతీయ జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ–20 ప్రపంచ కప్ మ్యాచ్లలో యుఎస్ఎ తరఫున ఆడుతున్నాడు. శనివారం టీ–20 ప్రపంచ కప్లో భాగంగా టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా తరఫున బరిలో దిగాడు. నంద్యాల జిల్లా యువకుడు అమెరికా దేశం తరఫున టీ–20 ప్రపంచ కప్లో ఆడుతుండడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


