న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలారివన్–అర్జున్ బబూతా ద్వయం భారత్కు పసిడి పతకాన్ని అందించింది.
నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్–అర్జున్ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది.
ముకేశ్కు రజతం, తనిష్క్ కు కాంస్యం
25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ సీనియర్ పురుషుల ఈవెంట్లో భారత షూటర్లు గుర్ప్రీత్ (575 పాయింట్లు), హర్‡్ష (571), అమన్ ప్రీత్ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ పురుషుల ఈవెంట్లోనూ భారత షూటర్లు క్లీన్స్వీప్తో అదరగొట్టారు.
సూరజ్ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.


