న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–సామ్రాట్ రాణా (భారత్) ద్వయం భారత్కు రజత పతకాన్ని అందించింది. 48 షాట్లతో కూడిన ఫైనల్లో సురుచి–సామ్రాట్ జోడీ 479.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. నగీనా సైద్కులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్) జంట 481.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
అంతకుముందు 10 జోడీల మధ్య 60 షాట్లతో నిర్వహించిన క్వాలిఫయింగ్లో సురుచి–సామ్రాట్ 583 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రషి్మక సహగల్ (237.9 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... వన్షిక చౌధరీ (236.7 పాయింట్లు) రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది.
యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు ప్రియాన్షి పూర్వ (234.8 పాయింట్లు) స్వర్ణం... చహెక్ కోహ్లా (233 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్ విభాగాల్లో రష్మిక, వన్షిక, అగం గ్రెవాల్ జట్టు... ప్రియాన్షి, చహెక్, శిక్షా శరణ్ జట్టు పసిడి పతకాలు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారత్ ఖాతాలో పది స్వర్ణాలున్నాయి.


