మాస్కో: ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏ సంస్థ నుంచి చమురును దిగుమతి చేసుకోవాలనే పూర్తిస్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా ప్రకటించింది. ‘‘మేము సైతం అంతర్జాతీయ ఇంధన నిపుణుల బాటలోనే నడుస్తున్నాం. భారత్కు ఒక్క రష్యాయే కాదు ఎన్నో దేశాలు తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.
ఎవరి నుంచి ఏం కొనాలనే స్వేచ్ఛ భారత్కు మొదట్నుంచీ ఉంది. ఇందులో కొత్తేమీ లేదు’’అని రష్యా అధ్యక్షభవనం అధికార ప్రతినిది దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి మోదీ సర్కార్ రష్యా నుంచి పూర్తిగా ముడిచమురు కొనుగోళ్లను ఆపేసిందన్న వార్తలపై మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించగా పెస్కోవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే రష్యా హైడ్రోకార్బన్లను భారత్ కొనుగోలుచేయడం ఉభయతారకమని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు.
భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇది చదవండి: ట్రంప్నే బెంబేలెత్తించింది.. భారత్ విజయ రహస్యం ఇదే!
కాగా, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. మన దేశ ఆహార, వ్యవసాయ రంగాలకు ఈ ఒప్పందంలో పూర్తి రక్షణలు ఉన్నట్లు తెలిపారు. ఆయన బుధవారం తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. మన దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని అన్నారు.
అమెరికాతో ఒప్పందం వల్ల మనకు లాభం చేకూరుతుందని ప్రకటించారు. అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఎగుమతుల విషయంలో మన పోటీ సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం హఠాత్తుగా కుదిరిందని కాదని, భారత్, అమెరికా మధ్య పలు దఫాల చర్చల తర్వాతే తుదిరూపు వచ్చిందని స్పష్టంచేశారు. ఇది సమతుల్య, పరస్పర ప్రయోజనాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు.


