సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు చాంపియన్గా అవతరించింది. మైసూర్లో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 10 పరుగుల ఆధిక్యంతో విశ్వేశరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ (బెలగావి) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఉస్మానియా జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించింది.
కునాల్ దాస్వాని (41 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), వైభవ్ సజానా (27 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించగా... అన్విత్ రెడ్డి (38; 6 ఫోర్లు), పారస్ రాజ్ (37; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విశ్వేశరయ్య జట్టు 204 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
సమర్థ్ హెగ్డే (46), విష్ణు గౌడర్ (39) ఆకట్టుకున్నారు. ఉస్మానియా జట్టు బౌలర్లలో కెపె్టన్ వంశీ కుమార్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు... ధర్మపురి సాత్విక్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు... వీఎం ధనుష్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. యశ్వీర్కు ఒక వికెట్ లభించింది.


