మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే.. | lakhs of devotees to gather at kashi vishwanath temple for maha shivratri | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..

Feb 15 2026 8:17 AM | Updated on Feb 15 2026 8:53 AM

lakhs of devotees to gather at kashi vishwanath temple for maha shivratri

వారణాసి: నేడు(ఆదివారం) మహాశివరాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఈ ఏడాది మహాదేవుని సన్నిధిలో 26 గంటల పాటు నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పండితులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కాశీకి తరలివస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారణాసి జిల్లా యంత్రాంగం ఆలయ కమిటీ హై అలర్ట్ ప్రకటించాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. గంగా ఘాట్‌ల వద్ద ప్రత్యేక నిఘాను పెంచిన అధికారులు.. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
 

గంగా నది తీరాన కొలువై ఉన్న పురాతన కాశీ నగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా, మోక్ష ప్రాప్తికి ప్రధాన కేంద్రంగా భక్తులు విశ్వసిస్తారు. హిందూ సంస్కృతిలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినమే సృష్టి ఆరంభమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పౌరాణిక కథల ప్రకారం పరమశివుడు ఇదే రోజున మహాగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల వివాహం జరిగిన అద్భుత ఘట్టం కూడా ఈ రోజేనని  చెబుతుంటారు. అందుకే శివభక్తులు ఈ రాత్రంతా జాగరణ చేస్తూ, అభిషేకాలతో భోళాశంకరుడిని కొలుస్తారు.

ఉజ్జయినిలో వైభవంగా భస్మ హారతి
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకే అర్చకులు పవిత్ర పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం, గంధం, సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. ఆపై మహాకాళుడికి తెల్లని వస్త్రాలను ధరింపజేసి,  అత్యంత ప్రీతిపాత్రమైన ‘విజయ’ అలంకారం చేశారు. శంఖారావాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ‘భస్మ హారతి’ని కళ్లారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ తలుపులను 44 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈ పర్వదినం సందర్భంగా సుమారు 10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, క్యూ లైన్ల నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినిలో మహాశివరాత్రికి ముందు తొమ్మిది రోజుల పాటు ‘శివ నవరాత్రి మహోత్సవాలు’ అత్యంత వైభవంగా నిర్వహిస్తునన్నారు. శివరాత్రి మరుసటి రోజున స్వామివారికి ‘సెహ్రా’ అలంకరించి భస్మ హారతిని నిర్వహిస్తారు. 


ఇది కూడా చదవండి: Bangladesh: తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement