పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వేర్పాటువాద సెగలతో అట్టుడుకుతోంది. గురువారం బలోచిస్థాన్లోని ఖరాన్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక డిప్యూటీ కమిషనర్ లక్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దళాలు మెరుపు దాడి చేశాయి. అతడిని అదుపులోకి తీసుకునేందుకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించింది.
కానీ డిప్యూటీ కమిషనర్ మాత్రం వారికి చిక్కలేదు. కానీ అక్కడే విధుల్లో ఉన్న ఒక లేవీస్ (స్థానిక భద్రతా దళం) అధికారిని తొలుత అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ తర్వాత అతడు స్థానిక బలోచ్ వ్యక్తి అని తెలియడంతో బీఎల్ఏ విడిచిపెట్టింది. కాగా ఈ ఆపరేషన్ సమయంలో డిప్యూటీ కమిషనర్కు చెందిన రెండు అధికారిక వాహనాలను బీఎల్ఏ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఈ విషయాన్ని బీఎల్ఏ అధికార ప్రతినిధి ఆజాద్ బలోచ్ ధ్రువీకరించారు. ప్రస్తుత ఖరాన్ డిప్యూటీ కమిషనర్ కేవలం తన పరిపాలనా విధులకు మాత్రమే పరిమితం కావాలని, బలోచ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బలోచ్ ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుత ఖరన్ డిప్యూటీ కమిషనర్గా మునీర్ అహ్మద్ సూమ్రో ఉన్నారు.


