టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. సూపర్-8కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పాక్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
ఆఖర్లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. మధ్యలో కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో నమీబియా బౌలర్లు తమ సామర్థ్యానికి మించి రాణించారు. వికెట్లు తీయలేకపోయినా, జోరుమీదున్న పాక్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెర్నాల్డ్ స్కోల్జ్ 4 ఓవర్లలో 33 పరుగులు, రూబెన్ ట్రంపల్మెన్ 4 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి పా్ బ్యాటర్లను కట్టడి చేశారు.
జాక్ బ్రస్సెల్ (4-0-48-2) పరుగులు కాస్త ఎక్కువగానే సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (3-0-25-1), జేజే స్మిట్ (3-0-28-0) పర్వాలేదనిపించారు. మైబుర్గ్ (2-0-27-0) ఒక్కడే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో నమీబియా బౌలర్లు కేవలం 6 ఎక్స్ట్రాలు మాత్రమే ఇవ్వడం విశేషం.


