లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ తూర్పు ప్రాంతమైన బెకా వ్యాలీపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో హిజ్బుల్లాకు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి.
2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతి పెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే హిజ్బుల్లా నుండి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
అదేవిధంగా దక్షిణ లెబనాన్లోని సిడాన్ సమీపంలో ఉన్న 'ఐన్ అల్-హిల్వే' అనే పాలస్తీనా శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉందనే కారణంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. కానీ హమాస్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. అది కేవలం భద్రతను పర్యవేక్షించే జాయింట్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రమని హమాస్ స్పష్టం చేసింది.


