వాషింగ్టన్: కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగ చీఫ్ శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. భారతీయులు కేవలం విదేశాలకు సేవ చేసే ముడి సరుకులుగా మారిపోయారని, స్వదేశం కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారుచేయలేదని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడారు.
ఈ సందర్భంగా పిట్రోడా మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారత్ యువతను ముడి సరకులుగా తయారుచేస్తోంది. దేశీయంగా నూతన ఆవిష్కరణల కోసం వాళ్లను భారత్ సద్వినియోగం చేసుకోవట్లేదు. మనం పెద్ద సంఖ్యలో యువ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తున్నాం కానీ అదంతా ముడిపదార్థంగా ఉండిపోతోంది. ఇది అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఉపయోగపడుతోంది. మన యువతను వాళ్లు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, లీగల్ సర్వీసులు, పరిశ్రమలు, తయారీరంగాలు, రవాణా వ్యవస్థల్లో విరివిగా వాడుకుంటున్నారు. భారత్ దేశీయంగా ఉపయోగించుకునేందుకు వీలుగా అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను ఒక్కదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయింది’’ అని అన్నారు.
పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘లష్కరే తోయిబా మాదిరిగా ‘లష్కరే కాంగ్రెస్’కు పిట్రోడా ప్రధాన సలహాదారుగా తయారయ్యారు. మరోసారి భారత్కు అబద్ధాల బురద పూయాలని చూస్తున్నారు. మొబైళ్ల కోసం కనీసం ఆపరేటింగ్ సిస్టమ్(ఓస్)ను భారతీయులు సృష్టించలేదని ఆయన అంటున్నాడు. ఆయన కనీసం బాస్ లైనక్స్, మాయా ఓఎస్, ప్రైమ్ ఓఎస్, భార్ ఓఎస్, ఇండస్ ఓఎస్, ఎన్ఎక్స్టీ క్వాంటమ్ ఓఎస్ పేర్లు వినలేదేమో. ఇవన్నీ భారతీయులు తయారుచేసిన ఓఎస్లే’’ అని అన్నారు.


