ఉద్రిక్తంగా ‘చలో కామారెడ్డి’ | High Tension in Kamareddy | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా ‘చలో కామారెడ్డి’

Feb 23 2026 4:21 AM | Updated on Feb 23 2026 4:21 AM

High Tension in Kamareddy

రాంచందర్‌రావును అరెస్టు చేస్తున్న పోలీసులు

బీజేపీ ముఖ్యనేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు

రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టు... బొల్లారం పీఎస్‌కు తరలింపు

పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హౌస్‌ అరెస్టు

పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై కమలనాథుల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: బీజేపీ రాష్ట్ర నాయ­కత్వం పిలుపు మేరకు ఆదివారం తలపెట్టిన చలో కామారెడ్డి ఉద్రిక్తంగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావుతో­పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఉద్రిక్త వా­తా­వరణం నెలకొంది. శనివారం రాత్రి నుంచే వారి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ నాయకత్వాన్ని కామారెడ్డికి వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాత్రి నుంచి హౌస్‌ అరెస్టులో ఉన్న రాంచందర్‌రావు ఎలాగైనా సరే కామారెడ్డి పర్యటనకు వెళ్లాల్సిందేనంటూ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.

అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు రాంచందర్‌రావును అడ్డుకున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తార్నాకకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల తోపులాటల మధ్య రాంచందర్‌రావుతోపాటు మరికొందరిని అరెస్టు చేసి బొల్లారం, గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌లకు తరలించారు. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా హౌస్‌ అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం: కేంద్రమంత్రి సంజయ్‌
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ నేతలు దాడులు చేయడమేంటి? కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గం. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంకావాలి. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. బాన్సువాడలో 70 మందిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యల్లేవు. 

గొంతునొక్కే కుట్ర: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రను చేస్తోంది. నియంతృత్వంగా వ్యవహరించడంలో బీఆర్‌ఎస్‌ సర్కారు­ను తలపిస్తోంది. రేవంత్‌ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుంది.   

నిర్బంధ పాలన: ఎంపీ డీకే అరుణ
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిర్బంధ పాలన చేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు వెళ్లడం నేరమా? బీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోంది. అక్రమ అరెస్టులు చేసి, నిర్బంధించడం హేయమైన చర్య. 

కేసీఆర్‌ ప్రభుత్వం తరహాలోనే..: ఎంపీ ఈటల
రాంచందర్‌రావు అరెస్ట్‌ అప్రజాస్వామికం. కేసీఆర్‌ ప్రభుత్వంలో హౌస్‌ అరెస్టుల తీరు ఇప్పుడు పునరావృతమైనట్లు కనిపి­స్తోంది. నాడు కేసీఆర్‌ ఇదే తరహా హౌస్‌ అరెస్టులు చేసి ప్రజా­స్వామ్యాన్ని ఖూనీచేయగా.. నేడు రేవంత్‌రెడ్డి అదే పాటిస్తు­న్నా­రు. అధికార పార్టీ నేతలే గూండాయిజం చేస్తున్నారు.

ఎమర్జెన్సీని గుర్తు చేశారు: రాంచందర్‌రావు
అరెస్ట్‌కు ముందు రాంచందర్‌రావు మాట్లాడు­తూ.. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరాగాం«ధీ హయాంలో విపక్ష నేతలను ఇష్టానుసారంగా అరెస్టు చేసి గొంతు నొక్కిన 1975 ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుచేసిందని మండిపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల అనంతరం ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేశారని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యం ఖూనీ: జి.కిషన్‌రెడ్డి
బీజేపీ నేతల హౌస్‌ అరెస్టు కక్షసాధింపే. రాష్ట్రంలో ప్రజా­స్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఖూనీ చేస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దౌర్భాగ్యకరం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్‌ నాయకులు కారుతో గుద్ది ధ్వంసం చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలను హౌస్‌ అరెస్టు చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement