పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, తీన్మార్ మల్లన్న
నాగర్కర్నూల్ పీఎస్ ఎదుట కుటుంబసభ్యుల నిరసన
సాక్షి, నాగర్కర్నూల్: రెండు రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహకులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతోపాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారు’ అని మర్రి ఆరోపించారు.


