ఆ విషయం సీఎం రేవంత్రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎనుముల రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని తాము అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్ విమర్శించారు.
హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ‘ఎనుముల బ్రదర్స్’ పద్ధతి ప్రకారం లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం.. తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


