తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి త్రివేండ్రం స్కాటిష్ స్కూల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన మూడు బస్సులు మంటలకు ఆహుతి కాగా, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో మరో వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.
తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వాహనాల నుంచి పెద్ద శబ్ధాలతో పాటు మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. కజకూట్టం, చాకై ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కజకూట్టం అగ్నిమాపక కేంద్ర అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెండు పాఠశాల బస్సులతో పాటు ఒక ట్రావెలర్ వాహనం పూర్తిగా కాలిబూడిదయ్యింది.
ఈ ఘటనకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బస్సులకు ఎదురుగా పార్క్ చేసి ఉండాల్సిన ట్రావెలర్ వాహనం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల వైపునకు కదిలి ఉండటాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. ఎవరో కావాలనే ఆ వాహనాన్ని నెట్టి ఉండవచ్చని, మంటలు కూడా ఆ ట్రావెలర్ నుంచే ప్రారంభమైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి


