సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైల దేవస్థానంలో మరో సారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. దేవస్థాన వసతి విభాగ పరిధిలోని వీఐపీ కాటేజీలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. కాటేజీలో ఉన్న భక్తులు భయాందోళనకు గురై కిందకు పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైల దేవస్థాన పరిధిలో సుమారు 35పైగా వీఐపీ కాటేజీలు ఉన్నాయి. ఆయా కాటేజీలు దాతలు నిర్మించి దేవస్థానానికి అప్పగించారు. దేవస్థానం భక్తులకు రోజువారి బాడుగ కింద ఇస్తుంది.

ఇటీవల అబ్బూరు శ్రీనివాసరావు నిలయం పేరుతో నిర్మించిన కాటేజీని భక్తులకు ఇచ్చారు. మొదటి అంతస్తులో సుమారు 13మంది వరకు భక్తులు సేద తీరుతున్నారు. అయితే ఒక్కసారిగా కాటేజీలోని మొదటి అంతస్తులోని గదిలో ఏసీ పేలడంతో మంటలు చేలరేగాయి. అందులో ఉన్న భక్తులు భయాందోళనకు గురై ఏమి చేయాలో దిక్కుతోచక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.

అప్పటికే మంటలు వ్యాపించి, నల్లటి పోగ కాటేజీ మొత్తం చుట్టుకుంది. సమాచారం అందుకున్న దేవస్థాన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వసతి విభాగం అధికారుల నిర్లక్ష్యం వలనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని భక్తులు వాపోతున్నారు. త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నామని, లేకుంటే ప్రాణాలు పోయేవని భక్తులు వాపోతున్నారు.


